మధ్యప్రదేశ్ ఆసుపత్రుల్లో జ్యోతిషం
- రూపాయలు 5 కే జ్యోతిష్యం...
- ఇక ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ జ్యోతిష్యం...
- అవి హాస్పిటల్లా...ఆస్ట్రాలజీ కేంద్రాలా...
మధ్యప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం కొత్త నిర్ణయం తీసుకుంది. రానున్న సెప్టెంబర్ నెల నుంచి వివిధ జబ్బులను నయంచేసేందుకు ప్రభుత్వాసుపత్రులలో జ్యోతిష్యుల సేవలు అందుబాటులోకి తెస్తున్నది.
వైద్యానికి తోడుగా జ్యోతిషం, వాస్తు, హస్తసాముద్రికం, వైదిక కర్మకాండలు నిర్వహించే వారి సేవలను కూడా రోగులకు అందజేయాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. నిపుణులతో ప్రత్యేకంగా ఆస్ట్రాలజీ ఔట్పేషెంట్ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం మహర్షి పతంజలి సంస్కృత సంస్థాన్ ఈ బాధ్యతలు చేపడుతుంది.
రోగులకు వారంలో రెండు రోజులపాటు, రోజుకు నాలుగుంటలు ఈ జ్యోతిష వైద్యం అందుబాటులో ఉంటుంది.. 5 రూపాయలు చెల్లిస్తే చాలు.. రోగుల చేతుల్లోని రేఖలను, వారి జాతక చక్రాలను పరిశీలించి వారు బాధపడుతున్న రోగానికి జోత్యష వైద్యం చేస్తారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఎంపీఎస్ఎస్ డైరెక్టర్ తివారీ వెల్లడించారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వ తాజా నిర్ణయం అటు ప్రజల్లోను, ఇటు రాజకీయ వర్గాల్లోను సంచలనం సృష్టించింది. ఎందుకంటే, ఆసుపత్రుల్లోకి వైద్యానికి తోడు జ్యోతిషాన్ని తీసుకువచ్చిన తొలి రాష్ట్రం బిజెపి ఏలుబడిలో ఉన్న మధ్య ప్రదేశే.