వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త...
భారీగా తగ్గిన వంట గ్యాస్ ధర
వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. గత కొద్ది నెలలుగా వంటగ్యాస్ ధర తగ్గుముఖం పట్టిందని కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వశాఖ తెలిపింది. మే నెల వరకు వంటగ్యాస్ సిలిండర్పై దాదాపు రూ. 100వరకు ధర తగ్గిందని పేర్కొంది. వంట గ్యాస్ ధరలు నానాటికీ పెరుగుతున్నాయని ఇటీవల వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ మంత్రిత్వశాఖ స్పందించి ఈ మేరకు ప్రకటన చేసింది.
దిల్లీలో సబ్సీడీయేతర వంటగ్యాస్ సిలిండర్ రీటైల్ ధర 2017 డిసెంబరులో రూ. 747గా ఉంది. 2018 మే నెల నాటికి ఇది రూ. 96.50 తగ్గి రూ. 650.50గా ఉందని మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇక సబ్సీడీ ద్వారా వినియోగదారులకు అందించే గ్యాస్ సిలిండర్ ధర గతేడాది డిసెంబరులో రూ. 495.69 ఉండగా.. ఈ ఏడాది మే నెల నాటికి రూ. 491.21కి తగ్గిందని తెలిపింది.
ఒక్కో ఇంటికి ఏడాదికి 12 చొప్పున వంటగ్యాస్ సిలిండర్లకు కేంద్రం సబ్సీడీ ఇస్తోంది. అంతకంటే ఎక్కువ అవసరమయ్యే వారు మార్కెట్ ధరకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.