మహిళ వయసు 55 కాగా, అబ్బాయి వయసు 22 తమకు రక్షణ కల్పించాలంటూ ఆదివారం గోల్కొండ పోలీసులను ఆశ్రయించారు.
ఇద్దరు వ్యక్తుల ప్రేమించుకోవడం.. వారి పెళ్లికి పెద్దలు అంగీకారం తెలపకపోవడంతో.. ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించి తమకు న్యాయం చేయండి అని కోరడం లాంటివి మనం చాలా సినిమాల్లో చూశాం. నిజ జీవితంలోనూ ఇలాంటి సంఘటనలు అడపా దడపా జరుగుతూనే ఉన్నాయి. సరిగ్గా ఇలాంటి సమస్యతోనే ఓ ప్రేమ జంట పోలీసు స్టేషన్ ని ఆశ్రయించారు. వారి సమస్య పరిష్కారం పక్కన పెడితే.. వారి వ్యవహారం చూసి పోలీసులే తలలు పట్టకున్నారు. ఇంతకీ వాళ్ల కథ ఏమిటంటారా.. ఆ ప్రేమ జంటలో మహిళ వయసు 55 కాగా, అబ్బాయి వయసు 22. ఈ సంఘటన జరిగింది హైదరాబాద్ నగరంలో.
వివరాల్లోకి వెళితే... గోల్కొండ ధాన్కోటకు చెందిన అయేషాబేగం (55) భర్త నాలుగు నెలల క్రితమే మరణించాడు. తర్వాత ఆమెకు, అదే ప్రాంతానికి చెందిన ఓ కొరియర్ సంస్థలో సూపర్వైజర్గా పనిచేస్తున్న మహ్మద్ ముదస్సిర్ అలియాస్ అర్షద్ (22)తో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త సహజీవనానికి దారి తీసింది.
విషయం తెలుసుకున్న ఇరు కుటుంబ సభ్యలు.. వీరి సహజీవనానికి అభ్యంతరం తెలిపారు. బెదిరింపులకు కూడా పాల్పడటంతో ఆయేషా, అర్షద్ లు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా తమకు రక్షణ కల్పించాలంటూ ఆదివారం గోల్కొండ పోలీసులను ఆశ్రయించారు. ఇన్స్పెక్టర్ సయ్యద్ ఫయాజ్ వీరికి కౌన్సెలింగ్ నిర్వహించారు. అయినా వీరు పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయానికే కట్టుబడటంతో పోలీసులు తలపట్టుకున్నారు. చేసేది లేక వారం రోజుల తర్వాత మళ్లీ స్టేషన్కు రావాలని సూచించి పంపారు. వారం రోజుల తర్వాత మతపెద్దల సమక్షంలో వీరితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని సీఐ తెలిపారు.
