అన్ని రకాల బ్రాండ్ల మద్యం ధరలు పెరగనున్నాయి బేసిక్‌ కేసు ధరపై 20% పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నలిచ్చింది.

మందు బాబుల జేబులు లూటీ కానున్నాయి. అన్ని రకాల బ్రాండ్ల మద్యం ధరలు పెరగనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఈ విధానం వచ్చే దీపావళి పండుగ నుంచి అమలు కానున్నాయి. కొత్త ఎక్సైజ్ చట్టం అక్టోబర్ లో రానుంది. ఆ చట్టం ప్రకారం మద్యం ధరలు ఆకాశానంటనున్నాయి.

బ్రాండ్‌నుబట్టి క్వార్టర్‌కు రూ. 6 నుంచి రూ. 30 వరకు పెరిగే అవకాశం ఉంది. బేసిక్‌ కేసు ధరపై 20% పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నలిచ్చింది. పెంచిన ధరల్లో పన్నులను మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని డిస్టిలరీల యాజమాన్యాలకే ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. ధరలు కనీసం 15శాతం పెంచకపోతే తమ ఉత్పత్తులు నిలిపేస్తామంటూ కంపెనీలు హెచ్చరించిన క్రమంలో మద్యం ధరల పెంపుపై తెలంగాణ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. దీనిపై త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకోనున్నారు.

అక్టోబరు నెల నుంచి మద్యం దుకాణాలు రాత్రి 11గంటల వరకు తెరచి ఉంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందని రెండు రోజుల క్రితం వార్తలు వెలువడ్డాయి. ఆ వార్తకు సంతోషించపడిన మందుబాబులను అదే అక్టోబర్ నెలలో ధరలు పెరుగుతున్నాయనే వార్త మాత్రం మింగుడు పడటం లేదు.