పన్నీరుకు రోశయ్య ఝులక్
రాజీనామాను వెనక్కి తీసుకొని పన్నీరు మళ్లీ సీఎం అయ్యే అవకాశం లేదని స్పష్టం చేసిన తమిళనాడు మాజీ గవర్నర్
తమిళనాట రాజకీయాలు రోజుకో మలుపుతిరుగుతున్న వేళ పన్నీరు భవిష్యత్తుపై, శశికళ వ్యూహాలపై కాంగ్రెస్ సీనియర్ నేత, తమిళనాడు మాజీ గవర్నర్ కొణజేటి రోశయ్య స్పందించారు.
ఇటీవల వరకు తమిళనాడుకు ఆయన గవర్నర్ గా ఉన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ నేతగా ఉన్నప్పటి నుంచి కూడా ఆయనకు తమిళ నేతలతో సత్సంబంధాలున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ లో కీలక నేతగా ఉన్న చిదంబరంనకు రోశయ్య మంచి మిత్రుడు కూడా.
పన్నీరు రాజీనామా అనంతరం తమిళనాడు తాజా మాజీ గవర్నర్ రోశయ్య ఈ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.అక్కడి ప్రజలు, తమిళ నటులు ఒక వైపు పన్నీరుకే మద్దతు పలుకుతున్నా ఆయన సీఎం కావడం కష్టమేనంటున్నారు ఈ సీనియర్ రాజకీయ నేత.
పన్నీరు తమ రాజీనామా పత్రాన్ని గవర్నర్ కు సమర్పించడం.... గవర్నర్ కూడా ఆ రాజీనామాను ఆమోదించడం తెలిసిన విషయమే. అయితే ఈ సమయంలో గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత పన్నీరు తన రాజీనామా ను వెనక్కి తీసుకొనే మళ్లీ సీఎం అయ్యే అవకాశం ఉండదని రోశయ్య పేర్కొన్నారు.
రాజ్యాంగపరంగా ఇది సాధ్యంకాని విషయం అని స్పష్టం చేశారు. అయితే పన్నీరు మళ్లీ సీఎం కావాలంటే మెజారిటీ ఎమ్మెల్యేలు ఆయనను తమ శాసనసభ నేతగా ఎన్నుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. అప్పుడే ఆయన మళ్లీ సీఎంగా ఉండగలరన్నారు.
తాను ఆ రాష్ట్రానికి గవర్నర్ గా ఉన్నప్పుడు జయలలితతో తనకు సత్సంబంధాలే ఉన్నాయని గుర్తు చేశారు.
శశికళ పై కోర్టు కేసులు ఉన్న నేపథ్యంలో ఆమె సీఎం అవడానికి అవరోధాలు ఏర్పడుతాయని చెప్పారు.