ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం, చిన్నారి మృతి
- ఖమ్మంలో ఘోర రోడ్డు ప్రమాదం
- ముగ్గురు మృతి
- ఘటనాస్థలాన్ని సందర్శించిన మంత్రి
ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుల్లుగా మద్యం తాగిన ఓ డ్రైవర్ లారీని రోడ్డు పక్కన నడుస్తున్న జనాలమీదికి ఎక్కించడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు.
ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం వైరా మండలం పినపాక స్టేజి గ్రామం వద్ద ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ రోడ్డుపక్కన నడుస్తున్న పాదచారులను ఢీ కొట్టాడు. ఈ లారీ ఢీ కొట్టిన వ్యక్తులెవరు బతకలేదంటేనే అర్థం చేసుకోవాలి లారీ ఎంత వేగంగా ప్రయాణించిందో. ఖమ్మం వైపు నుంచి వచ్చిన లారీ ఈ ప్రమాదానికి కారణమైంది. ఈ ఘటనలో సోమయాజు, దావీద్ అనే వ్యక్తులతో పాటు ఆమర్లపూడి దామిని అనే చిన్నారి అక్కడిక్కడే మృతి చెందారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండి డ్రైవింగ్ చేయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అయితే ఈ ఘటనపై సమాచారం అందుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రమాదస్థలిని పరిశీలించారు. సమాచారం అందగానే హుటాహుటిన తరలివచ్చానని తుమ్మల తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను మంత్రి పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. లారీ డ్రైవర్ మద్యం సేవించి అతి వేగంగా లారీని నడపడం వల్లే ప్రమాదం జరిగిందని వైరా డీఎస్పీ తుమ్మలకు వివరించారు.