జనవరి 27 వ తేదీన దినమంతా నోరెత్తకుంటే మంచిది. ఎత్తారో మరసటి రోజు నుంచే కష్టాలే నంటున్నారు సిద్ధాంతి శ్రీనివాస గార్గేయ
ఇలాంటి పరిస్థితి వూహించండి.
ఆ రోజు మన ముఖ్యమంత్రులు ప్రసంగాలుండవు. రాజకీయ పార్టీల అధికార ప్రతినిధులు విమర్శలు,ప్రతివిమర్శులుండవు. జగన్మోహన్ రెడ్డి కూడా మౌనం పాటిస్తాడు. రోజా ఆయన్ని ఫాలోఅవుతుంది.మంత్రి దేవినేని కూడా ఏమ్మాట్లాడడు.రఘువీరా రెడ్డి కూడా అంతే. అటువైపు తెలంగాణాలో రేవంత్ రెడ్డి, , ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడనే మాట్లాడరు. కామ్రేడ్ తమ్మినేని సీతారం అసలు నోరు విప్పడు. పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడు. టిజెఎసి ఛెయిర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ పబ్లిక్ మీటింగుండదు. బాల్కసుమన్ నియోజకవర్గం పనుల్లో మునిగిపోతాడు... టివియాంకర్లు కూడా గమ్మునుంటారు. రిపోర్టర్ల ఫోన్-ఇన్ లు ఉండవు. లైవ్ లుండవు. రోజూ పెద్దగా అరిచే వాళ్లంతా నోరుమూస్కుంటారు.భార్యాభర్తలారోజు రాజీపడతారు. మీకు ఫోన్ లురావు, వస్తే ఎస్ఎంఎస్ వాట్సాఫ్ మాత్రమే ఉండవచ్చు. లేదా టెక్స్ట్ కి దీనినిి అప్లయిచేయవచ్చు. అంతా నిశబ్దం. ఆ కొద్ది సేపు మనమంతా ప్రశాంతంగా గడపొచ్చు. లేదా ఏదో పుస్తకం ముందరేసుకుని పీస్ఫుల్ గా కాలం వెల్లదీయవచ్చు.
ఇది సాధ్యమా? సాధ్యమే.
సిద్ధాంతి పొన్నలూరి శ్రీనివాస గార్గేయ మాట వింటే జనవరి 27 వ తేదీ కొద్ది సేపు ప్రపంచం ఇలా నిశబ్దమవుతుంది.
ఎందుకంటే, 2017 జనవరి 27న రానున్నది మౌని అమావాస్య.
ఏటా వచ్చే అమావాస్యలా కాకుండా ఈ సారి చాలా సమస్యలతో వస్తున్నది ఆయన హెచ్చరిస్తున్నారు.
ఆ రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మౌనంగా ఉంటే మంచిది.
అంతసేపు మాట్లాడకుండా ఉండలేని వారు ఉదయం 10-30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకైనా తప్పకుండా మౌనంగా పాటించాలని సిద్ధాంతి చెబుతున్నారు. ఆయన విశాఖలో 2017 గురించి మాట్లాడుతూ ఈ సలహా ఇస్తున్నారు.
ఒకవేళ ఎవరైనా ఆ సమయంలో మాట్లాడితే గ్రహాల ప్రభావం వల్ల మరుసటి రోజు నుంచే సమస్యలు వస్తాయన్నారు. ప్రతి సంవత్సరం సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించిన తర్వాత వచ్చే తొలి అమావాస్యను పుష్య అమావాస్య లేదా మౌని అమావాస్య అంటారని చెప్పారు. అదే 27 న రానుంది. జాగ్రత్త నోటితో బతికే వాళ్లంతా దేశం,కోసం ప్రజల కోసం ఆ కొద్ది సేపు మౌనంగా ఉంటారేమో చూద్దాం.
