జర్నలిస్టు గౌరీ లంకేష్ ను కాల్చిచంపిన దుండగులు
బెంగళూరులో గౌరీ లంకేష్ పై కాల్పులు. రక్తపు మడుగుల్లో ప్రాణాలొదిలిన నిర్భీతి జర్నలిస్టు
ప్రఖ్యాత కన్నడ జర్నలిస్టు గౌరీ లంకేష్ ను కొంతమంది దుండగులు కాల్చి చంపారు. బెంగుళూరు ఆర్ ఆర్ నగర్ లోని ఆమె ఇంటి వద్దే మంగళవారం రాత్రి ఈ సంఘటన జరిగింది.
ఈ వార్తను కెంగేరి డిసిపి అనుచేత్ ధృవీకరించారు.
డిసిపి ఏషియానెట్ గ్రూప్ చెందిన సువర్న టివికి హత్య గురించి కొన్ని వివరాలందించారు. ఈ వివరాల ప్రకారం, దుండగులు ఆమె మీద మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. వెంటనే,రక్తపు మడుగుల్లో పడిపోయిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆమె అప్పటికే చనిపోయిందని పోలీసులు చెప్పారు. కాల్పలు ఎవరు జరిపారన్నది తెలియడం లేదు.
గౌరి మీద కాల్పులు జరిపిన తీరుకు, కన్నడ రచయిత, హేతువాది డాక్టర్ ఎం ఎం కలబుర్గి మీద కాల్పులు జరిగితీరుకు చాలా పోలికలున్నాయి. రెండేళ్ల కిందట ధార్వాడ్ లో కలబుర్గిని కూడా ఇలాగే గుర్తు తెలియని వ్యక్తులుకాల్చి చంపి పారిపోయారు. కలబుర్గిలాగే ఆమె కూడా హేతవాది.
గౌరి, ఒక నాటి ప్రముఖ జర్నలిస్టు పి లంకేశ్ కూతురు. కొద్ది రోజులు తండ్రి స్థాపించిన లంకేశ్ పత్రిక సంపాదకత్వం వహించారు. నక్సల్ హక్కుల మీద చాలా కాలంగా ఆమె పోరాడుతున్నారు. కొంతమంది ప్రముఖ నక్సల్స్ ని జనజీవన స్రవంతి లోకి తీసుకురావడంలో ఆమె కీలక పాత్ర పోషించారు.
జంకుగొంకు లేని, నిర్భీతి జర్నలిజానికి గౌరి ప్రతినిధి. ఆమె మీద కాల్పులు జరిపి హతమార్చడం బెంగుళూరును కుదిపేసింది.