జోరు పెంచిన పవన్ అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాల ఏర్పాటుకు నిర్ణయం ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానంటున్న పవన్
ముందస్తు ఎన్నికల నేపథ్యంలో పవన్ జోరు పెంచారు. రానున్న ఎన్నికలే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. తన పార్టీ శ్రేణులను జనాల్లోకి తీసుకువెళ్లే యత్నాలు మొదలుపెట్టారు. ఎన్నికల్లో పోటీ చేయాలంటే.. ముందు పార్టీకి ఓ కార్యాలయం ఉండాలని పవన్ ఇప్పటికి తెలుసుకున్నారు. అందుకే ఆ దిశగా చర్యలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే పవన్ తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని పవన్ భావిస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల రాజధానులైన హైదరాబాద్, అమరావతిలో ఐదెకరాల విస్తీర్ణంలోనూ, జిల్లాల్లో రెండెకరాల్లోనూ పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. ముందస్తు ఎన్నికల సమరం మొదలౌతున్న నేపథ్యంలో పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే హైదరాబాద్ లో పవన్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఆయన స్నేహితులు, పార్టీ కార్యకర్తలు అతి కొద్ది మంది మాత్రమే పాల్గొన్నారు.

ప్రస్తుతం పార్టీ సభ్యత్వాలపై దృష్టిపెట్టిన పవన్ జనసేన కార్యాలయాల ఏర్పాటును కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని యోచిస్తున్నారు. ఇక, తెలంగాణలో తొలిదశలో జిల్లా కేంద్రాల్లోనే కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు.

రెండో దశలో కొత్తగా ఏర్పడిన అన్ని జిల్లాల్లోనూ జనసేన కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. ఇందుకు సంబంధించి పార్టీలోని కొంత మందికి పవన్ బాధ్యతలు అప్పజెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని పవన్.. తన పార్టీ కార్యకర్తలకు సూచించినట్లు సమాచారం. ప్రజారాజ్యం పార్టీ అనుభవాలు పునరావృతం కాకుండా ఉండేందుకు పవన్ నానా అవస్థలు పడుతున్నారు.
