ఉద్యోగులపై హామీల జల్లు కురిపించిన జగన్ జాబు రావాలంటే బాబు పోవాలని పిలుపునిచ్చిన జగన్ ఉద్యోగులకు ఇళ్లు కట్టిస్తానన్న జగన్
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఉద్యోగ వర్గాలపై హామీల జల్లు కురిపించారు. సోమవారం ఉదయం ఆయన ఇడుపులపాయలో ప్రజా సంకల్పయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో తాను అధికారంలోకి వస్తే.. ఉద్యోగులకు మేలు చేస్తానని హామీ ఇచ్చారు.
ప్రతి ఉద్యోగికి స్థలం, ఇళ్లు కట్టించి ఇస్తానని చెప్పారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామన్నారు. ఉద్యోగులకు కాంట్రీబ్యూటరీ పెన్షన్ను అమలుచేస్తామని హామీ ఇచ్చారు. ‘జాబు రావాలంటే బాబు రావాలని’ గత ఎన్నికల్లో ప్రచారంతో ఊదరగొట్టారని, కానీ ఇప్పుడు ‘జాబు రావాలంటే బాబు పోవాల్సిందే’నని జగన్ పిలుపునిచ్చారు.
50 ఏళ్లకే ప్రభుత్వ ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నిందని.. ఆ కుట్రను తమ పార్టీ నేతలు భగ్నం చేశారన్నారు. చంద్రబాబు ప్రభుత్వ కుట్ర బయటపడటంతో అబ్బే అలాంటిదేం లేదని ప్రభుత్వ పెద్దలు బుకాయిస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. జీవో కాపీలు లీక్ అయ్యాయనే సాకుతో ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేశారని, ఇలా ఉద్యోగులను సస్పెండ్ చేయడం న్యాయమేనా? అని ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు.
