నవంబర్ 28న హైదరాబాద్ లో గ్లోబల్ ఎంట్రపెన్యూర్‌షిప్ సమ్మిట్‌ జరగనుంది. అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ సదస్సును మొదట  వాషింగ్టన్ లో ప్రారంభించారు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె… సలహాదారు ఇవాంక ట్రంప్ త్వరలోనే హైదరాబాద్ రానున్నారు. నవంబర్ 28న హైదరాబాద్ లో గ్లోబల్ ఎంట్రపెన్యూర్‌షిప్ సమ్మిట్‌ జరగనుంది. ఈ సమ్మిట్ లో పాల్గొనాల్సిందిగా భారత ప్రధాని మోడీ.. ఇవాంకా ట్రంప్ ని కోరారు. ఈ నేపథ్యంలో ఆమె హైదరాబాద్ వస్తున్నారు.

2010లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ సదస్సును మొదట వాషింగ్టన్ లో ప్రారంభించారు. భారత్ ఈ సదస్సును నిర్వహించడం ఇదే తొలిసారి.

ఈ సదస్సు నిర్వహణ కోసం ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాలు కూడా పోటీ పడ్డాయి. కానీ హైదరాబాద్‌కున్న అనుకూలతల కారణంగా సదస్సు నిర్వహించే అవకాశం చివరికి హైదరాబాద్ కే దక్కింది. కేంద్రం సూచనల ప్రకారం మేరకు గ్లోబల్ ఎంట్రపెన్యూర్‌షిప్ సమ్మిట్‌ నిర్వహణ కోసం నీతి ఆయోగ్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. ఈ కార్యక్రమంలో హెచ్1బీ వీసాల అంశాన్ని భారత్ అమెరికా దృష్టికి తీసుకురానుంది.

సదస్సులో వర్క్ షాప్‌లను విస్తృత స్థాయిలో నిర్వహించనున్నారు. 2010లో జరిగిన తొలి సదస్సుకు వాషింగ్టన్ ఆతిథ్యం ఇవ్వగా.. తర్వాతి ఏళ్లలో ఇస్తాంబుల్, దుబాయ్, కౌలాలంపూర్, మర్రాకేష్, నైరోబీ, సిలికాన్ వ్యాలీల్లో వరుసగా ఈ సదస్సును నిర్వహించారు. స్టార్టప్ ఇండియాలో భాగస్వామ్యం ఉన్న భారతీయ వ్యాపారవేత్తలు ఈ సదస్సులో పాల్గొననున్నారు. ఈ ఏడాది ముఖ్యంగా మహిళా వ్యాపారవేత్తల పురోగతిపై దృష్టి సారించనున్నారు.