సిఎంల వైఖరిపై గవర్నర్ లో అసంతృప్తా?
తన సమక్షంలో సిఎంలిద్దరూ తీసుకున్న నిర్ణయాలకే విలువ లేనపుడు, ఇక మంత్రుల కమిటీలు తీసుకునే నిర్ణయాలకు మాత్రం ఏం విలువుంటుందని గవర్నర్ నిలదీసారట. గవర్నర్ అడగటంలో తప్పేమీ లేదుకదా? సిఎంలు ఇద్దరూ తీసుకున్న నిర్ణయాలు ఎందుకు అమలు కాలేదో ముందు స్పష్టం చేస్తేనే తదుపరి సమావేశాలుంటాయని గవర్నర్ చెప్పి మంత్రులను పంపేసారట.
ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ ఇద్దరు సిఎంల వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లే కనిపిస్తోంది. ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తిన సమస్యల పరిష్కారంపై గతంలో సిఎంలిద్దరు తీసుకున్న నిర్ణయాలేవీ ఇంత వరకూ అమలు కాలేదట. విభజన నేపధ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు తలెత్తిన సంగతి అందరకీ తెలిసిందే కదా? ఆ సమస్య పరిష్కారం కోసం మంత్రుల స్ధాయిలో రెండు ప్రభుత్వాలు కమిటిలు వేసాయి. అంతుకుముందే సిఎంలు చంద్రశేఖర్ రావు, చంద్రబాబునాయుడులు గవర్నర్ సమక్షంలోనే రెండు సార్లు సమావేశమయ్యారు.
ప్రతీసారి సిఎంలిద్దరూ సమావేశమవటం సాధ్యం కాదు కాబట్టి మంత్రులతో కమిటీలు వేసారు. మంత్రుల కమిటీ కూడా ఇప్పటికి మూడు సార్లు భేటీ అయ్యింది. ఇటీవలే కమిటి సమావేశమైన సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, గతంలో తన సమక్షంలో సిఎంలిద్దరు తీసుకున్న నిర్ణయాలు ఎంత వరకూ అమలయ్యాయో చెప్పమని అడిగారట. దాంతో ఉన్నతాధికారులు సమాధానం చెప్పలేకపోయారట. దాంతో గవర్నర్ కు విషయం అర్ధమైపోయింది.
తన సమక్షంలో సిఎంలిద్దరూ తీసుకున్న నిర్ణయాలకే విలువ లేనపుడు, ఇక మంత్రుల కమిటీలు తీసుకునే నిర్ణయాలకు మాత్రం ఏం విలువుంటుందని గవర్నర్ నిలదీసారట. గవర్నర్ అడగటంలో తప్పేమీ లేదుకదా? సిఎంలు ఇద్దరూ తీసుకున్న నిర్ణయాలు ఎందుకు అమలు కాలేదో ముందు స్పష్టం చేస్తేనే తదుపరి సమావేశాలుంటాయని గవర్నర్ చెప్పి మంత్రులను పంపేసారట.
అంతేకాకుండా ఇకనుండి సిఎంలు వస్తేనే సమావేశాలుంటాయని కూడా మెలిక పెట్టారట. దాంతో ఏం చేయాలో మంత్రులకు అర్ధం కాలేదు. తన అసంతృప్తిని గవర్నర్ ఇద్దరు సిఎంలకు స్పష్టంగా తెలియజేసారని సమాచారం. సిఎంలిద్దరూ ఎవరికి వారుగా బిగదీసుకుని కూర్చుంటే ఇక సమస్యలు ఎప్పుడు పరిష్కారం అవుతాయో ఏమో?