వ్యక్తిగత గోప్యత( ఇండివిడ్యువల్ ప్రైవసీ) అనేది వ్యక్తుల ప్రాథమిక హక్కేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఈ అంశంపై గతంలో ఇచ్చిన రెండు తీర్పులను న్యాయస్థానం కొట్టివేసింది.
భారత అత్యుత్తమ న్యాయస్థానం సుప్రీం కోర్టు ఈ రోజు ఇచ్చిన ఓ తీర్పు సంచలనం సృష్టిస్తోంది. అంతేకాదు పలు అనుమానాలకు తావునిస్తోంది. వ్యక్తిగత గోప్యత( ఇండివిడ్యువల్ ప్రైవసీ) అనేది వ్యక్తుల ప్రాథమిక హక్కేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు వ్యక్తిగత గోప్యతపై విచారణ చేపట్టిన తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన విస్త్రత ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెల్లడించింది. ఆర్టికల్ 21 ప్రకారం.. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనని తేల్చింది. ఈ అంశంపై గతంలో ఇచ్చిన రెండు తీర్పులను న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో ఆధార్ను అనుసంధానం చేయడంపై ప్రస్తుతం సందిగ్ధత నెలకొంది.
కేంద్ర ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు తదితర వాటికి ఆధార్ కార్డును కేంద్రం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆధార్ అనుసంధానంతో వ్యక్తిగత హక్కును ఉల్లంఘిస్తున్నారంటూ 2015లో సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో ఆధార్పై విచారించేందుకు ఏర్పాటు చేసిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం.. ఈ విషయంలో ముందుగా వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కా, కాదా అన్న అంశంపై చర్చ జరగాలని తేల్చింది. ఈ విషయంపై చర్చించేందుకు తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తున్నట్లు జులై 18న సుప్రీంకోర్టు తెలిపింది.
రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లో ఈ హక్కు ఉందా, లేదా అనే దానిపై చర్చించాలని, వీటిపై స్పష్టత వచ్చాకే ఆధార్ పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల విచారణను చేపడుతామని న్యాయస్థానం స్పష్టం చేసింది.దీనిపై కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు అరవింద్ దాతర్, శ్యామ్ దివాన్, గోపాల్ సుబ్రమణ్యం, ఆనంద్ గ్రోవర్లు తమ వాదనలను లిఖితపూర్వకంగా కోర్టుకు సమర్పించారు. తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనంలో చీఫ్ జస్టిస్ ఖేహర్తో పాటు.. న్యాయమూర్తులు జాస్తి చలమేశ్వర్, ఎస్ఏ బాబ్డే, డీవై చంద్రచూడ్, ఎస్ అబ్దుల్ నజీర్, ఆర్కే అగర్వాల్, రోహిన్టన్ ఫాలీ నారీమన్, అభర్ మనోహర్ సాప్రే, సంజయ్ కిషన్ కౌల్ ఉన్నారు.
కాగా.. ఇప్పటికే చాలా మంది అన్నింటికీ ఆధార్ ని అనుసంధానం చేసుకున్నారు. మరి కొందరు చేసుకోవాల్సిన వారిలో ఉన్నారు. తాజాగా సుప్రీం ఇచ్చిన తీర్పుతో ఆధార్ అనుసంధానం చేయాలా వద్దా.. అనే సంసయం ప్రజల్లో మొదలైంది. దీనికి పరిష్కారం ప్రభుత్వం చెబుతుందేమో వేచి చూడాలి.
