Asianet News TeluguAsianet News Telugu

నిరుద్యోగులకు శుభవార్త

ఇంటర్ పాస్ అయితేచాలు.. జాబ్ గ్యారెంటీ
good news for unemployees central government offers jobs in navi and armi sections

నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్తను తెలియజేసింది. కేవలం ఇంటర్ పాస్ అయ్యి ఉంటేచాలు.. వారికి ఉద్యోగం గ్యారెంటీ.  ఉద్యోగానికి తగిన శిక్షణ వారే ఉచితంగా ఇచ్చి.. ఆ తర్వాత ఉద్యోగం కూడా వారే కల్పిస్తారు. మరి ఆ ఉద్యోగ వివరాలెంటో ఒకసారి చూద్దామా...

నేవీలో ఉద్యోగం...
ఇండియన్‌ నేవీ 10+2 బీటెక్‌ క్యాడెట్‌ ఎంట్రీ స్కీం ద్వారా ఇంటర్‌ ఎంపీసీ విద్యార్థులకు మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ విధానంలో ఎంపికైనవారు కేరళలోని నేవల్‌ అకాడమీ- ఎజిమాలలో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ లేదా మెకానికల్‌ బ్రాంచీల్లో నాలుగేళ్లపాటు ఇంజినీరింగ్‌ విద్యను ఉచితంగా చదువుతారు. విజయవంతంగా కోర్సు పూర్తిచేసుకున్నవారికి జేఎన్‌యూ డిగ్రీలను ప్రదానం చేస్తుంది. భోజనం, వసతి, పుస్తకాలు, దుస్తులు అన్నీ ఉచితమే. అనంతరం సబ్‌-లెఫ్టినెంట్‌ హోదాతో నెలకు దాదాపు రూ. లక్షకు పైగా వేతనంతో నేవీలోనే ఉద్యోగిగా కొనసాగవచ్చు.  ప్రతి సంవత్సరం జూన్‌, డిసెంబరుల్లో ప్రకటనలు వెలువడతాయి. 
ఎంపిక: దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను జేఈఈ- మెయిన్స్‌లో సాధించిన ర్యాంకు ద్వారా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అనంతరం వీరికి సర్వీసెస్‌ సెలక్షన్‌ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) బెంగళూరు, భోపాల్‌, కోయంబతూర్‌, విశాఖపట్నంల్లో ఏదోఒక చోట రెండు దశల్లో 5 రోజుల పాటు ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. తొలిరోజు స్టేజ్‌-1 పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఇంటెలిజెన్స్‌ టెస్టు, పిక్చర్‌ పర్సెప్షన్‌ టెస్టు, గ్రూప్‌ డిస్కషన్‌ ఉంటాయి. ఇందులో అర్హత సాధించినవారికి మిగిలిన 4 రోజుల పాటు స్టేజ్‌-2 ఇంటర్వ్యూలు కొనసాగుతాయి. దీనిలో భాగంగా సైకలాజికల్‌ పరీక్షలు, గ్రూప్‌ పరీక్షలు, ముఖాముఖి నిర్వహిస్తారు. ఇందులోనూ అర్హత సాధిస్తే ఫిజికల్‌ టెస్టు (ఎత్తు, బరువు), వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించి తుదిదశ నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు ఇండియన్‌ నేవల్‌ అకాడమీ, ఎజిమాల (కేరళ)లో బీటెక్‌ విద్యను నాలుగేళ్లపాటు అభ్యసిస్తారు. విజయవంతంగా కోర్సు పూర్తిచేసుకున్నవారికి జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)-న్యూదిల్లీ ఇంజినీరింగ్‌ డిగ్రీని ప్రదానం చేస్తుంది.  అనంతరం సబ్‌-లెఫ్టినెంట్‌ హోదాతో నేవీలో విధుల్లోకి చేరతారు. 
అర్హత: ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ల్లో  70 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణత. దీంతోపాటు పదోతరగతి లేదా ఇంటర్‌ ఇంగ్లిష్‌లో కనీసం 60 శాతం మార్కులు. 
వయసు: 16 1/2 - 19 ఏళ్ల మధ్యలో ఉండాలి. 
ఇతర అర్హతలు: అభ్యర్థులు జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించాలి. ఈ పోస్టులకు అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఎత్తు కనీసం 157 సెం.మీ. ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు తప్పనిసరి. 
వెబ్‌సైట్‌: ‌www.joinindiannavy.gov.in

ఆర్మీలో ఉద్యోగం...
ఇంటర్‌ ఎంపీసీ గ్రూప్‌ విద్యార్థులకు ఇంజినీరింగ్‌ విద్యతోపాటు లెఫ్టినెంట్‌ ఉద్యోగాన్ని అందిస్తోంది ఇండియన్‌ ఆర్మీ. ఇందుకోసం 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌ కోర్సు నిర్వహిస్తోంది. షార్ట్‌ లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు రెండు దశల్లో వివిధ పరీక్షలు జరిపి నియామకాలు చేపడతారు. అన్ని విభాగాల్లోనూ అర్హత సాధించినవారికి శిక్షణ తరగతులు ఉంటాయి. విజయవంతంగా శిక్షణ, కోర్సు పూర్తి చేసినవారికి ఆర్మీలో శాశ్వత ప్రాతిపదికన లెఫ్టినెంట్‌ హోదాతో ఉద్యోగం ఇస్తారు.ఇండియన్‌ ఆర్మీ 10+2 టెక్నికల్‌ ఎంట్రీకి ప్రకటనలు ఏడాదికి రెండుసార్లు మే/ జూన్‌, నవంబరు/ డిసెంబరుల్లో వెలువడతాయి. 
అర్హత: అవివాహిత పురుషులై ఉండాలి. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్‌ సబ్జెక్టుల్లో 70 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణులై ఉండాలి. 
వయసు: 16 1/2 ఏళ్ల నుంచి 19 1/2 ఏళ్లు. 
ఎత్తు: కనీసం 157.5 సెం.మీ. ఉండాలి. 
ఎంపిక: దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఇంటర్‌ ఎంపీసీ గ్రూప్‌లో సాధించిన మార్కుల మెరిట్‌ ఆధారంగా షార్ట్‌ లిస్ట్‌ చేస్తారు. ఎంపికైన వారికి అయిదు రోజులుపాటు రెండు దశల్లో అలహాబాద్‌, బెంగళూరు, భోపాల్‌, కపుర్తలాల్లో ఏదో ఒక చోట ఎస్‌ఎస్‌బీ సైకలాజికల్‌ పరీక్షలు, గ్రూప్‌ పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. తొలిరోజు స్టేజ్‌-1 పరీక్షలు ఉంటాయి. ఇందులో అర్హత సాధించినవారిని స్టేజ్‌-2కు అనుమతిస్తారు. అన్ని విభాగాల్లోనూ రాణించిన వారికి మెడికల్‌ టెస్టు ఉంటుంది.  అందులోనూ విజయవంతమైతే తుది శిక్షణకు పంపుతారు. 
శిక్షణ: కోర్సులో చేరినవాళ్లకి అయిదేళ్లపాటు శిక్షణ ఉంటుంది. తొలి ఏడాది ఆఫీసర్‌ ట్రెయినింగ్‌ అకాడమీ - గయలో బేసిక్‌ మిలిటరీ శిక్షణ నిర్వహిస్తారు. అనంతరం టెక్నికల్‌ ట్రెయినింగ్‌ నాలుగేళ్లు ఉంటుంది. ఇందులో ఫేజ్‌-1 కింద ప్రీ-కమిషన్‌ శిక్షణ మూడేళ్లపాటు ఇస్తారు. ఫేజ్‌-2లో భాగంగా ఏడాదిపాటు పోస్ట్‌ కమిషన్‌ ట్రెయింగ్‌ ఉంటుంది. ఫేజ్‌-1, ఫేజ్‌-2 శిక్షణలు సీఎంఈ, పుణె; ఎంసీటీఈ, మావ్‌; ఎంసీఈఎంఈ, సికింద్రాబాద్‌లో నిర్వహిస్తారు. ఎంపికైనవారు ఎలక్ట్రికల్‌ అండ్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సులు చదువుతారు. మూడేళ్ల శిక్షణ అనంతరం అభ్యర్థులకు నెలకు రూ.56,100 చొప్పున స్టైపెండ్‌ చెల్లిస్తారు. నాలుగేళ్ల శిక్షణ అనంతరం పూర్తి వేతనం అమలవుతుంది. లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. శాశ్వత ఉద్యోగులుగా పరిగణిస్తారు. విజయవంతంగా కోర్సు పూర్తిచేసుకున్న వారికి దిల్లీలోని జేఎన్‌యూ ఇంజినీరింగ్‌ డిగ్రీని ప్రదానం చేస్తుంది. 
వెబ్‌సైట్‌: ‌www.joinindianarmy.nic.in
 

Follow Us:
Download App:
  • android
  • ios