జమ్మూ కాశ్మీరులోని షోపియన్ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆదివారంనాడు నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.

శ్రీనగర్: జమ్మూ కాశ్మీరులోని షోపియన్ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆదివారంనాడు నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. గాలింపు చర్యల తర్వాత ఎదురు కాల్పులు ప్రారంభమయ్యాయి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఉగ్రవాదులు షోపియన్ లోని బదిగాం ఇమామ్ షాహిబ్ లోని ఇంట్లో ఉన్నట్లు భద్రతాబలగాలు గుర్తించాయి. కేంద్ర సాయుధ పోలీసులు బలగాలు (సిఆర్పీఎఫ్), జమ్మూ కాశ్మీర్ పోలీసులు, రాష్ట్రీయ రైఫిల్స్ బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సందర్భంగా ఉగ్రవాదులతో ఎదురుకాల్పులు జరిగాయి.

ఇంట్లో దాక్కున ఉగ్రవాదులు బలగాలపై కాల్పులు జరిపారు. దీంతో బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఇంకా ఎదురుకాల్పులు జరుగుతున్నట్లు సమాచారం. 

భద్రతా బలగాలపై స్థానికులు రాళ్లు రువ్వారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా అదనపు సిఆర్పీఎఫ్ బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. లొంగిపోవాలని షోపియన్ సీనియర్ పోలీసు సూపరింటిండెంట్ శైలేంద్ర మిశ్రా మైకులో హెచ్చరించారు. 

అయినా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఎదురు కాల్పుల్లో ఓ సైనికుడు, ఓ పోలీసు గాయపడ్డారు. ఉగ్రవాదిగా మారిన కాశ్మీర్ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా ఇంటిలో దాక్కున్నవాళ్లలో ఉన్నట్లు చెబుతున్నారు. అతనితో పాటు హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.