మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి చేదు అనుభవం గుంటూరు జిల్లా రైతులు ఆయనకు చుక్కలు చూపించారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. గుంటూరు జిల్లా రైతులు ఆయనకు చుక్కలు చూపించారు. రైతులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక మంత్రి బిక్క మొఖం వేశారు.
అసలేం జరిగిందంటే.. తెగుళ్ల కారణంగా గుంటూరు జిల్లాలోని కొన్ని మండలాల్లో పత్తి పంట నాశనమైంది. దీంతో.. ఆ పంటలను పరిశీలించేందుకు గురువారం మంత్రి సోమిరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రావెల కిశోర్ బాబు తో కలిసి ప్రత్తిపాడు మండలంలో పర్యటించారు. మండలంలోని తిక్కిరెడ్డిపాలెం, కోయవారి పాలెం గ్రామాల్లో పత్తి పంటలు పూర్తిగా నాశనమైపోయాయి. దీంతో.. ఆ పంటలను పరిశీలించడానికి వచ్చిన అధికారులపై రైతులు విరుచుకుపడ్డారు. పురుగు మందుల కంపెనీలు మోసం చేశాయని రైతులు ఆరోపించారు. ఆ కంపెనీలపై వ్యవసాయ శాఖ అధికారుల నిఘా లేదని మంత్రిని నిలదీశారు. మంత్రి వెంట ఉన్న వ్యవసాయాధికారులపై కూడా మండిపడ్డారు. దీంతో ఎమ్మెల్యే రావెల కిశోర్ బాబు వెంటనే రైతులతో మాట్లాడి వారికి నచ్చచెప్పారు.
