పన్నీరుకు మద్దతివ్వమని స్పష్టం చేసిన డీఎంకే
తమిళ రాజకీయ డ్రామా కంటిన్యూ అవుతోంది. గవర్నర్ ఎటూ తేల్చరు. చిన్నమ్మ శిబిరంలో ఎమ్మెల్యేలు కదలరు. పన్నీరు తన పట్టు వీడడు. అదును కోసం బీజేపీ, అవకాశం కోసం డీఎంకే ఎదురుచూస్తేనే ఉంది.
నిన్నటి వరకు పన్నీరుకు మద్దతంటూ సంచలనం రేపిన ప్రధాన ప్రతిపక్షం డీఎంకే ఇప్పుడు ప్లేటు ఫిరాయించింది. పన్నీరు ఆశలపై నీళ్లు జల్లింది.
రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు డీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ ముఖ్యనేత స్టాలిన్ తమ నేతలతో సుదీర్ఘంగా చర్చించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... అన్నాడీఎంకే తమ ప్రధాన ప్రత్యర్థి అని, ఆ పార్టీ చీలిక వర్గాలకు తమ మద్దతు ఎట్టి పరిస్థితుల్లో ఉండదని కుండబద్దలు కొట్టారు.
శశికళ కు సంబంధించి ఆదాయానికి మించి ఆస్తుల కేసుపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధాని ఇవ్వకుండా దాటవేశారు. కోర్టు తీర్పు అనంతరమే తాను స్పందిస్తానని స్పష్టం చేశారు.
అన్నా డీఎంకేలో సంక్షోభం వల్ల రాష్ట్రంలో పాలన కుంటుపడిపోయిందని, అభివృద్ధి నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా , స్టాలిన్ వ్యాఖ్యలతో పన్నీరు శిబిరంలో ఉన్న ఆ కాస్త ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు తమ రూటు తాము చూసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రజలు, సినీ తారలు పన్నీరు వైపే ఉన్నా... పార్టీ ఎమ్మెల్యేలంతా శశికళ శిబిరంలో ఉన్నారు.
ఈ నేపథ్యంలో డీఎంకే మద్దతుతో తానే మళ్లీ సీఎం కావొచ్చని ఈ రోజు వరకు పన్నీరు ధీమా గా ఉన్నారు. కానీ, స్టాలిన్ వ్యాఖ్యలతో ఆ ఆశలు పూర్తిగా అడుగంటాయి.
