ఫిరాయింపు ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
- వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన రాజేశ్వరి
- పార్టీ మారడానికి గల అసలు కారణాన్ని బయటపెట్టిన రాజేశ్వరి
ఫిరాయింపు ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే ఈ రంపచోడవరం ఎమ్మెల్యే వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే. పార్టీ ఫిరాయించిన నాటి నుంచి.. ఆమె తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. కాగా.. తాను పార్టీ మారడానికి గల కారణాలను ఆమె తాజాగా వివరించారు.
అసలు విషయం ఏమిటంటే.. వంతల రాజేశ్వరి నియోజకవర్గ ప్రజలను మోసం చేశారంటూ వైసీపీ కోర్డినేటర్ ఉదయ భాస్కర్ ఆరోపించారు. ఈ ఆరోపణలపై శనివారం రాజేశ్వరి స్పందించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను టీడీపీలో చేరినట్లు ప్రకటించిన ఆమె..దాని వెనుక అసలు రహస్యం తెలిపారు. వైసీపీ నేత ఉదయభాస్కర్ కారణంగానే తాను పార్టీ మారానని ఆమె చెప్పారు. తాను పార్టీ వీడేలాగా ఇబ్బందులకు గురి చేశాడని వాపోయారు. ఇప్పుడు పార్టీ మారాక తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా తనపై దుష్ర్పచారం చేస్తున్నారని వాపోయారు. తాను ప్రజల సేవకు అంకితమవుతుంటే.. తనను సేవ చేయనీయకుండా అడ్డుకున్నాడని ఆరోపించారు.
రాజేశ్వరి పార్టీ మారకముందు.. టీడీపీ తనకు రూ.20కోట్లు ఇస్తామని ఆశచూపించిందని.. అయినా తాను లొంగలేదని చెప్పారు. తాను వైసీపీలోనే కొనసాగుతానని కూడా చెప్పారు. అలా చెప్పి రెండు నెలలు గడవకముందే ఆ పార్టీ మారటం గమనార్హం