ఫిరాయింపు ఎమ్మెల్యే కిడారిని అందలం ఎక్కించిన చంద్రబాబు శాసనసభ విప్ గా నియమిస్తూ ఉత్తర్వులు ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ,వైసీపీ నేతలు

మరో ఫిరాయింపు ఎమ్మెల్యేని చంద్రబాబు అందలం ఎక్కించారు. కావాలనే ప్రతిపక్ష నేతలను రెచ్చగొట్టేలా టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇప్పటికే నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో.. ఫిరాయింపు ఎమ్మెల్యేలను డిస్ క్వాలిఫై చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ అసెంబ్లీ సమావేశాలను కూడా బహిష్కరించారు. కాగా.. మరో ఫిరాయింపు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుని శాసనసభ విప్ గా ఎంపిక చేశారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అసలేం ఏం జరిగిందంటే.. గురువారం శాసనసభ , శాసనమండలి విప్ ల నియామకం జరిగింది. శాసనసభ విప్ లుగా పి వి జి ఆర్ గణబాబు(విశాఖ), కిడారి సర్వేశ్వరరావు (విశాఖ)లను, శాసన మండలి విప్ గా బుద్ధ వెంకన్న,డొక్కా మాణిక్య వర ప్రసాద్, షరీఫ్,రామ సుబ్బారెడ్డి లను నియమిస్తూ ఉత్తరువులు జారీ చేశారు. దీంతో మరో ఫిరాయింపు ఎమ్మెల్యేకు ఉన్నత పదవిని కట్టబెట్టడం పట్ల వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని కించపరిచేలా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారంటూ విమర్శలు చేస్తున్నారు.

 ఇదిలా ఉంటే.. ఈ విషయంలో టీడీపీ నేతలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా టీడీపీలోనే ఉంటూ.. పార్టీకి సేవలు చేస్తున్న తమను కాదని ఫిరాయింపు ఎమ్మెల్యేకు విప్ పదవి ఎలా కట్టబెడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విప్ పదవి దక్కించుకున్నందుకు కిడారి, ఆయన మద్దతుదారులు తప్ప.. మరెవరిలోనూ సంతోషం కనపడకపోవడం గమనార్హం.