జగన్ పాదయాత్రకు వామపక్షాల మద్దతు
- జగన్ పాదయాత్రను ఆహ్వానిస్తున్నామన్న సీపీఎం కార్యదర్శి మధు
- ప్రజా సమస్యలు వెలుగులోకి వస్తాయన్న మధు
వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేపట్టనున్న పాదయాత్రకు వామపక్షాలు మద్దతు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాయి. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు.. బహిరంగంగానే జగన్ పాదయాత్రకు మద్దతు ప్రకటించారు. పాదయాత్రను ఆహ్వానిస్తున్నట్లు మీడియా తో చెప్పారు. నేడో... రేపో సీపీఐ పార్టీ కూడా పాదయాత్రకు మద్దతు తెలపనున్నట్లు సమాచారం.
ప్రజలకు ఉపయోగపడే పాదయాత్రలు ఎవరు చేసినా తమ పార్టీ ఆహ్వానిస్తుందని, అందులో భాగంగా వైఎస్ జగన్ పాదయాత్రను కూడా ఆహ్వానిస్తున్నట్లు మధు తెలిపారు.ఈ పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు మరింతగా వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును దోపిడీదారుల కేటగిరీలో లెక్కకట్టాలన్నారు. రాష్ట్రంలోని పలువురు మంత్రులు, వారి కుటుంబీకుల అక్రమాల గురించి వారి పార్టీకి చెందిన నాయకులే విమర్శిస్తుంటే సీఎం నోరు ఎందుకు ఎత్తడం లేదని ప్రశ్నించారు. తన సహచర మంత్రులపై వస్తున్న విమర్శల పట్ల సీఎం మౌనంగా ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. ఇదిలా ఉంటే.. వైసీపీ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం మంచి నిర్ణయం కాదని సీపీఐ రాష్ట్ర సెక్రటరీ రామకృష్ణ అన్నారు.