విద్యార్థి వద్ద నుంచి రూ.3.94లక్షలు వసూలు బ్రాంచి మారుస్తానని నమ్మించి మోసం
ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాల సీబీఐటీ(చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లో ఓ అధ్యాపకురాలిని పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థిని చీటింగ్ చేసిన కేసులో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. సీబీఐటీ లో కంప్యూటర్ సైన్స్ డిపార్ట్ మెంట్ కి ఆశాలత హెచ్ వోడీ( హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్) గా వ్యవహరిస్తున్నారు. అదే కళాశాలలో విద్యనభ్యసిస్తున్న ఓ విద్యార్థి సుల్తాన్ సీఈసీ బ్రాంచ్ నుంచి బయోటెక్నాలజీ బ్రాంచ్ కి మారాలనుకున్నాడు. ఇదే విషయాన్ని హెచ్ వోడీ ఆశాలతకు చెప్పగా అందుకు రూ.3.94 లక్షలు ఖర్చు అవుతుందని తెలిపారు. దీంతో సుల్తాన్ ఆ మొత్తాన్ని చెల్లించారు. డబ్బు చెల్లించి.. సంవత్సరం గడుస్తున్నా.. బ్రాంచ్ మార్చకపోవడంతో ఈ విషయంపై ఆశాలతను నిలదీశాడు. తన డబ్బులు తనకు ఇవ్వాల్సిందిగా కోరాడు. దానిని ఆమె స్పందించకపోగా.. కళాశాలకు రావడం మానేసింది. దీంతో మోసపోయినట్లు గ్రహించిన సుల్తాన్ పోలీసులను ఆశ్రయించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెపై చీటింగ్ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
