రష్యా బార్లలో భారీ బుద్ధ విగ్రహాలు స్పెషల్ ఎట్రాక్షన్ గా ప్రత్యక్ష మవుతున్నాయి
రిలాక్సవడానికి రెండు పెగ్గులేసుకోవడం మామూలే.
అయితే, చాలా మంది చుట్టూ చక్కటి, చల్లటి, నిర్మలమయిన పరిసరాలుంటే గాని గ్లాసెత్తరు.
పోతూ పోతూ రెండు గుటికెలు గుటుక్కున మింగే'సి ఒక ఉప్పు కల్లు నోట్లోవేసుకుని పరిగెత్తే వాళ్లను, వైన్ షాపు కౌంటర్ ముందే గుటగుటా తాగేసి పరుగు దీసే వాళ్లనూ చూశాం.
అయితే, మందుక్కూడ పూజక్కూచున్నట్లే శుచిగా, శుభ్రంగా,ప్రశాంతంగా,తీరుబడిగా, ధ్యానంలో కూర్చున్నట్లు కూచోవాలనే వాళ్లున్నారు.

ధ్యానం అంటే గుర్తొచ్చింది. మనకు సమాధి లేదా ధ్యాన ముద్ర అంటూనే గుర్తొచ్చేది బుధ్ద భగవానుడే. అందువల్ల బుద్ధుడు సమాధిలో ఉన్నంత ప్రశాంతగా ముందుకొడుతూ గడపాలన్న ఫిలాసఫీ తో రష్యవాళ్లిపుడు బుద్ధ బార్లు తెగ తెరచేస్తున్నారు.
రష్యాలో బుద్ధు భగవానుడిపుడు రోడ్ సైడ్ బార్ దగ్గిర నుంచి లగ్జరీ బార్ల దాకా మాస్కట్ అయిపోయాడు. సెయింట్ పీటర్స్ బర్గ్ సంస్థ ఒకటి ప్రపంచమంతా బుద్ధబార్ల పేరుతో అల్ట్రా మాడెర్న్ బార్లను తెరుస్తూ ఉంటే రష్యా మారు మూలపట్టణాల్లోని బార్లలో కూడా భారీ బుద్ధ విగ్రహాలు స్పెషల్ ఎట్రాక్షన్ గా ప్రత్యక్ష మవుతున్నాయి.
బార్ల ప్రమోషన్ లో భాగంగా ధ్యాన బుద్ధడి బారీ విగ్రహం ముందు నిలబడి నగ్న నృత్యాలు ఈ బార్ల అకర్షణ అయిపోయింది. ఇలా బుద్ధ భగవానుడు బార్ల పాలు కావడం రష్యాలో ఉన్న చిన్న బౌద్ధ సమాజానికి ఇబ్బందిగా తయారయింది.
చాలా చోట్ల ఇది తమ మనోభావాలను దెబ్బతీస్తూ ఉందని కోర్టులలో కేసులుకూడా వేశారు. ఒకటి రెండు చోట్ల కోర్టులు బార్ల మీద ఫైన్లు కూడా విధించారు. సైబీరియా మైనింగ్ పట్టణం నొవొరెజ్నెత్ స్కీలో ఉన్న ఒక బుద్ధ బార్ లో శుక్రవారం రాత్రిని ’ సెక్సీలేడీస్ నైట్ ‘ గా ప్రకటించడంతో వివాదం మొదలయింది. ఈ సెక్సీలేడీస్ బృందం ద్యాన ముద్ర లో ఉన్న బుద్ధుడి ఎదురుగా నిలబడి, బట్టలొకటొకటి వొలిచేస్తూ వయ్యారాలు వొలకబోయడం ఈ నైట్ ఏర్పాటు చేశారు.
కాక్ టెయిల్ ప్రమోషన్ కోసం ఈ బార్ బుద్ధుడి ముందు జరిగే నగ్న నృత్యం చేస్తున్న సుందరీమణు ఫోటోల ను ఇన్ స్టా గ్రామ్, రష్యన్ సోషల్ నెట్ వర్క్ వ్కోన్ టేక్టే లో పోస్టు చేస్తున్నారు.
ఈ అశ్లీల చిత్రాలు వలేరియా శాన్యియేవా కంటబడ్డాయి. బుద్ధడిని ఇలా బార్ లో అపవిత్రం చేయడం అమెను బాధించింది. ఇపుడు దేశ వ్యాపితంగా ఉన్న బుద్ధ బార్లను మూసేయాలనే సంతకాల ఉద్యమం చేపట్టింది. ఇప్పటికే దాదాపు 7 వేల మంది సంతకాలు చేశారు.
సెయింట్ పీటర్స్ బర్గ్ లో వెలసిన బుద్ధ బార్ ను ధ్యాన మందిరం లాగా రూపొందించి, సేద తీరండని ఒక సంస్థ ప్రచారం మొదలు పెట్టింది. వెలుతురు, రంగులు, అక్కడ వేసిన కుర్చీలు, పూలకుండీలు, షాండ్లేర్లు అన్నీ ప్రాచీన వైభవాన్ని, ప్రశాంత వాతావరణాన్ని సృష్టించే విధంగా రూపొందించారు. సేద తీర్చేందుకు, మనసును ప్రశాంతపరిచేందుకు ప్రత్యేకంగా ఏర్పాటయిన ఈ బార్లను అంతర్జాతీయ నగరాలయిన పారిస్, న్యూయార్క్, లండన్, మాంటే కార్లో, ప్రాగ్, బీరూట్ తదితర పట్టణాలలో ఏర్పాటుచేయాలని సెయింట్ పీటర్స్ బర్గ్ యాజమాన్యం నిర్ణయించింది. ఈ జాబితాలో ట్రూలీ గ్లోబల్ సిటి హైదరాబాద్ , వరల్డ్ క్లాస్ క్యాపిటల్ అమరావతి లేవు. ఏడ్చాలో నవ్వాలో మీ ఇష్టం.
