చాలా రోజుల తర్వాత ఈ రోజు నక్సల్బరి పేరు వినిపించింది.  అది కూడా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షానోట. పశ్చిమబెంగాల్ లో  పార్టీని విస్తరింపచేసే కార్యక్రమాన్ని  ఆయన నక్సల్బరి నుంచి ప్రారంభించారు. వసంత మేఘ గర్జన చల్లారింది. ఏ పాటయినా ఒక్కటే. అందుకోండి...వందేమాతరమ్

నక్సల్ బరిలో బిజెపి జెండా ఎగరబోతున్నదా...

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

నక్సల్బరీ అనే మాట వింటే ఒకప్పుడు వొడలు పులకరించేది.

ఆవూరెక్కడుందో కచ్చితంగా చెప్పలేకపోయినా, ఒక్క సారి కూడా ఆవూరినిచూడకపోయినా, ఆ మాట 1967 నుంచి రెండు మూడు తరాల యువకులను విప్లవం వైపు మళ్లించింది. ప్రాణ త్యాగాలు చేయించింది. ఒకరా ఇద్దరా, వందలలో.. వేలలో, నక్సల్బరీ పాటపాడుకుంటూ, నక్సల్బరీ మాట్లాడుకుంటూ, వూర్లోదలి, అయినవాళ్లను వదలి, చదువులొదలి, ఉద్యోగాలొదలి ప్రజలున్నచోటికల్లాపోయారు, కొండల్లో,అడవుల్లోకి పయనమయ్యారు.విప్లవం కల నేరుతుందుని తుపాకి పట్టారు. తూటాలకు బలయ్యారు. ఆదారి లో ఇంకా పోతున్నవాళ్లూ ఉన్నారు.

నక్సల్బరీ ఇతర రాష్ట్రాలకంటే తెలుగుయువకులనే ఎక్కువగా ఆవేశపర్చింది. అందునా తెలంగాణాను మరీఎక్కువ. తెలంగాణా నక్సల్బరీ మూడో అడ్రసు అయింది. రెండో అడ్రసు శ్రీకాకుళం.

ఈ నక్సల్బరీయే ఆ తరాల కుర్రవాళ్లకు నక్సలైట్ అని సమిష్టి నామకరణం చేసింది. ఈ దేశంలో స్వాతంత్య్రం అనే మాట తర్వాత అంతచర్చనీయాంశమయింది నాలుగక్షరాల ఈ చిన్నమాట, నక్సలైట్.

ఇపుడు చాలా రోజుల తర్వాత ఈ రోజు నక్సల్బరి పేరు వినిపించింది. అది కూడా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షానోట. పశ్చిమబెంగాల్ లో భారతీయ జనతా పార్టీని విస్తరింపచేసే కార్యక్రమాన్ని ఆయన నక్సల్బరి నుంచి ప్రారంభించారు. నక్సల్బరి బిజెపికి చాలా ముఖ్యమయందని కూడా చెప్పారు. పార్టీ బూత్ లెవెల్ వర్కర్స్ ను కలుసుకుని మాట్లాడేందుకు తన 15 రోజుల పర్యటనను ఆయన ఈ రోజు అక్కడినుంచే ప్రారంభించారు.

మిషన్ బెంగాల్ గా బిజెపి పిలుస్తున్న ఈ పర్యటనలో భాగంగా నక్సల్ బరి లోని ఒక దళితుని ఇంట ఆయన భోజనం కూడా చేశారు.

ఒకప్పుడు దేశంలో నంబర్ వన్ గా ఉన్న పశ్చిమ్ బెంగాల్ రాష్ట్రాన్ని కమ్యూనిస్టులు, టీఎంసీ పార్టీ దోచుకున్నారన్నారని ఆయన చెప్పారు. ఇపుడు బెంగాల్ లో కమలం వికసించడాన్ని కమ్యూనిస్టులు మమతా బెనర్జీ ఆపలేరని కూడ చెప్పారు. రేపు మమతా బెనర్జీ నియోజకవర్గం భవానీ పూర్ లో అమిత్ షా పర్యటిస్తున్నారు.