ఫిరాయింపు మంత్రులు డూప్లికేట్ కాదా?
- అయ్యన్నపాత్రుడికి బీజేపీ కౌంటర్ ఎటాక్
- ఫిరాయింపు నేతలు డూప్లికేట్ కాదా అని ప్రశ్నించిన బీజేపీ నేత సోము వీర్రాజు
మొట్టమొదటి సారిగా టీడీపీ నేతలకు.. మిత్రపక్షమైన బీజేపీ నుంచి ఫిరాయింపు నేతల విషయమై ప్రశ్నలు దూసుకువస్తున్నాయి. ఇదే విషయలో మంత్రి అయ్యన్నపాత్రుడుకి బీజేపీ నుంచి కౌంటర్ ఎటాక్ ఎదురైంది. బీజేపీ నేతలపై అయ్యన్న చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ నేతలు తిప్పికొట్టారు. అసలు విషయం ఏమిటంటే.. పురందేశ్వరి, కన్నా లక్ష్మీ నారాయణలు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఈ ఇద్దరు నేతలు డూప్లికేట్ నేతలంటూ అయ్యన్న కామెంట్ చేశాడు.
ఆయన కామెంట్స్ కి బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజ్ కౌంటర్ ఎటాక్ ఇచ్చాడు. కాంగ్రెస్ నుంచి బీజేపీకి వచ్చిన పురందేశ్వరి, కన్నా లక్ష్మీ నారాయణలు డూప్లికేట్ నేతలైతే.. వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన వాళ్లు డూప్లికేట్ నేతలు కాదా అని ప్రశ్నించారు.
అంతేకాదు డూప్లికేట్ నేతలకు మంత్రి పదవులు ఎలా కట్టబెట్టారంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్లో ఉంటూ సొంత మామ ఎన్టీఆర్నే ఓడిస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారని ప్రశ్నించారు. పోలవరంపై మాట్లాడే హక్కు బీజేపీ నేతలకూ ఉందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ గురించి ఇంజనీర్లు మాత్రమే మాట్లాడాలా అని ప్రశ్నించారు.