విమానాలకు సెగ పుట్టించిన భోగి మంటలు
బాలకృష్ణ తొడగొడితే రైలు ఆగుతుందో లేదో తెలియదు కానీ, భోగీ మంటలు వేస్తే గాల్లో విమానం కూడా ఆగిపోవాల్సిందే.
సంక్రాంతి భోగి మంటలు విమానాలకు పెద్ద సమస్యలే తెచ్చి పెట్టాయి. భోగి మంటల కారణంగా వ్యాపించిన దట్టమైన పొగతో చెన్నైలోని ఇంటర్నేషనల్ ఏయిర్ పోర్టులో విమానాల రాకపోకల దాదాపుగా స్తంభించి పోయాయి.
తమిళనాడులో పొంగల్ అతి ప్రధానమైన పండగ అనే విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చెన్నైలోని మీనంబాకం పరిసర ప్రాంతంలోని ప్రజలు పెద్దఎత్తున భోగి మంటలు వేశారు.
దీంతో దట్టమైన పొగలు విమానాశ్రయ ప్రాంతానికి వ్యాపించాయి. ఈ కారణంగా 19 విమానాలు ల్యాండ్ అవడానికి సాంకేతిక సమస్యలు వచ్చిపడ్డాయి. వీటిని ఆలస్యంగా ల్యాండ్ చేసినట్లు ఏయిర్ పోర్టు అధికారులు తెలిపారు.