"నోట్ల కష్టాలు మరొక ఆరు నెలల దాకా తీరేలా లేవు. ప్రయివేటు బ్యాంకుల నోట్ల మార్పిడి వ్యవహారం మీద దర్యాప్తు జరగాలి."

బ్యాంకు నోట్ల కొరత మీద, ఛలామణి మీద ప్రభుత్వం ఎలా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదో బ్యాంకు ఉద్యోగుల ఫెడరేషన్ బయటపెట్టింది.నోట్లను బ్యాంకులకు సరఫరా చేయడంలో కుంభకోణం ఉందని కూడా ఫెడరేషన్ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నోట్ల విషయంలో ప్రభుత్వ రంగ బ్యాంకులను కాదని, ప్రయివేటు బ్యాంకులకు అనుకూలంగా ప్రభుత్వం వ్యవరిస్తున్నదని కూడా ఫెడరేషన్ నాయకులు చెబుతున్నారు.

ఇపుడు చెలరేగుతున్న నోట్ల కొరత మీద, ప్రయివేటు బ్యాంకులకు,ప్రయివేటు బ్యాంకులకు నోట్లను అందుబాటులో ఉంచుతున్న తీరు మీద సమగ్రమయిన దర్యాప్తు జరపాలని బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య డిమాండ్ చేసింది. 

 ఫెడరేషన్ నాయకులు ఈ రోజు హైదరాబాద్ లో మాట్లాడుతూ ప్రభుత్వం చెబుతున్న అనేక విషయాలను ఖండించారు. ప్రభుత్వం, రిజర్వు బ్యాంకులు అనేక విషయాలలో ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నాయని, దీని వల్ల డిమాండ్ ను తట్టుకోలేనంత వత్తిడికి బ్యాంకు ఉద్యోగులు గురవుతున్నారని, వత్తిడికి లోనయి చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయని వారు చెప్పారు.

నోట్ల కొరత తీవ్రంగా ఉందని, దీనితో బ్యాంకింగ్ కార్యకాలపాలు స్తంభించిందని, కేవలం డిపాజిట్లు తీసుకోవడం తప్ప మరొక వ్యాపారం జరగడం లేదుని వారు చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లు చెబుతున్నట్లు మూడు నాలుగు వారాలలో నోట్ల సంక్షోభం సమసిపోయేటట్లు లేదని వారు చెప్పారు.

దేశంలోని నాలుగు నోట్ల ముద్రణాలయాలు రేయింబగలు పనిచేసినా నోట్లు అందుబాటులోకి వచ్చేందుకు మరొక అయిదారు నెలలు పడుతుందని వారు తెలిపారు.ప్రభుత్వం చెబుతున్న 80 వేల కు పైగా ఎటిఎంలను కొత్త రెండువేల నోట్ల కోసం రీ క్యాలిబ్రేట్ జరగలేదని వారు స్పష్టం చేశారు. ఎటిఎం సరఫరా దారు అందిస్తున్న సమాచారం ప్రకారం రీక్యాలిబ్రేట్ చేసిన ఎటిఎం ల సంఖ్య 23 వేల మించలేదని ఈ నాయకులు చెప్పారు.

అనుచరులతో కలసి ఫెడరేషన్ నాయకుడు బిఎస్ రాం బాబు విలేకరులతో మాట్లాడారు.

ప్రయివేటు బ్యాంకుల నోట్ల వినిమయంలో అవకతవకలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేస్తూ, అక్కడ రు.24 వేల పరిమితి మించి నోట్లు అందిస్తున్న ట్లు ఫిర్యాదులందుతున్నందు దీని మీద విచారణకు అదేశించాలని ఫెడరేషన్ నాయకులు హైదరాబాద్ డిమాండ్ చేశారు.

ఆంధ్రాబ్యాంకు వంటి పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు కూడా నగదు లేదని పేరుతో డిపాజిట్ దారులను వాపసు పంపిస్తున్నాయని చెబుతూ బ్యాంకులతో నగదు లేదు, ఎటిఎంలలో నగదు లేదు, డిపాజిట్ దారులు ఎలా జీవిస్తారని ఫెడరేషన్ ప్రశ్నించింది.

తెలంగాణా లో అయిదొందల నోట్ల విడుదల నామమాత్రంగానే జరిగిందని ఎక్కడో కొన్ని ఎటిఎంలలో తప్ప బ్యాంకులలో ఈ నోట్లు కనిపించడం లేదని ఫెడరేషన్ నాయకులు చెప్పారు.