రెండో రోజుకు చేరుకున్న జగన్ పాదయాత్ర జగన్ పై విమర్శనాస్త్రాలు కురిపిస్తున్న అధికార పార్టీ నేతలు
వైకాపా అధినేత జగన్ పై అధికార పార్టీ నేతలు మరోసారి మాటల దాడికి దిగారు. ఒకరి తర్వాత మరొకరు.. జగన్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇప్పటికే మంత్రి పత్తిపాటి, అచ్చెన్నాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు విమర్శించగా.. వారి జాబితాలో మరో మంత్రి యనమల కూడా చేరిపోయారు.
అసలు విషయం ఏమిటంటే..జగన్ ప్రజా సంకల్ప యాత్ర సోమవారం మొదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్.. అధికార పార్టీ వైఫల్యాలను ఎత్తిచూపారు. దీనిపై మంత్రులు ఒక్కొక్కరిగా విరుచుకుపడుతున్నారు.
జగన్ ఆర్థిక నేరాలు తెలుగు ప్రజలకు తెలిసిందేనని.. ప్యారడైజ్ పత్రాల ద్వారా ఇప్పుడు ప్రపంచానికి తెలిసిందని ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. 714 మంది భారతీయ ఆర్థిక నేరగాళ్లలో జగన్ ప్రత్యేక స్థానం పొందారని ఎద్దేవా చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే జగన్ పాదయాత్ర చేపట్టారని ఆరోపించారు. ఒక ఆర్థిక నేరస్థుడు, పన్ను ఎగవేతదారుడు పాదయాత్ర చేసినట్లు చరిత్రలో లేదన్నారు. పాదయాత్ర మధ్యలో కోర్టు వాయిదాలకు హాజరైన చరిత్ర గతంలో ఎవరికీ లేదన్నారు.
వైఎస్ పాలనలో 7లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం ఎందుకు తగ్గిందో జగన్ సమాధానం చెప్పాలని యనమల డిమాండ్ చేశారు. రాష్ట్ర అప్పుల గురించి మాట్లాడే ముందు వైఎస్ పాలనలో పెరిగిన రెట్టింపు అప్పుల గురించి సమాధానం చెప్పాలన్నారు. ఆర్థిక నేరస్థుడిగా ముద్ర పడిన జగన్ నోటి వెంట ప్రత్యేక హోదా మాట రావడం ఎబ్బెట్టుగా ఉందన్నారు. రాష్ట్రం విడిపోయాక తెదేపా ప్రభుత్వం వరుసగా మూడేళ్లు రెండంకెల వృద్ధి ఎలా సాధించిందో జగన్ పాదయాత్రలో చెప్పాలని సూచించారు.
