సిఎంఎస్ సర్వే ప్రకారం కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర లు అవినీతిలో టాప్
అన్నింటా దేశంలో నెంబర్ వన్ కావాలనుకుంటున్న ఆంధ్రప్రదేశ్ అవినీతిలో ఈ గుర్తింపు సాధించేందుకు యమస్పీడుగా వెళ్తున్నది.
ఆంధ్రప్రదేశ్ అవినీతిలో నెంబర్ టు అని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అధ్యయనంలో వెల్లడయింది.
ప్రభుత్వాలలో పనులు ఎలా జరుగుతున్నాయి, ప్రజలెలా పనులు చేయించుకుంటున్నారు వగైరా విషయాల మీద 20 రాష్ట్రాలలో సర్వే చేసి ఆంధ్రప్రదేశ్ నెంబర్ 2 అని ఈసంస్థ లెక్కగట్టింది.
మొదటి స్థానం పొరుగు రాష్ట్రం కర్నాటకకే దక్కింది.
ఈ సర్వే ప్రకారం కర్నాటక, ఆంధ్రప్రదేశ్,తమిళనాడు, మహారాష్ట్ర,జమ్ముకాశ్మీర్, పంజాబు రాష్ట్రాలు చాలా అవినీతి రాష్ట్రాలు.
సర్వేచేసిన వారిలో 77 శాతం కర్నాటక లో తాము లంచం ఇచ్చిన వైనం గురించి మాట్లాడారు. ఇక ఆంధ్రలో అవినీతి అనుభవం ఉన్నవారు 74 శాతం మంది ఉండగా తమిళనాడు ఈ రెండు రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉంది. అక్కడ 2016లో కనీసం ఒకసారి లంచం చెల్లించిన వారు 68 శాతం దాకా ఉన్నారు.
కేరళలో అవినీతిని అనుభవం ఉన్న వాళ్లు కేవలం 4 శాతమే ఉన్నారు. వారి సంఖ్య ఛత్తీష్ గడ్ లో 13 శాతమ మాత్రమే.
ఇలాగే హిమాచల్ ప్రదేశ్ తక్కువ అవినీతి ఉన్న రాష్ట్రం.
ఇలాంటి సర్వేనే 2005 లో కూడా ఈ సంస్థ చేపట్టింది. అప్పటికి ఇప్పటికి అవినీతి తగ్గిందనే వాళ్లుకూడా ఉన్నారు.
3000 వేల కుటుంబాలు సర్వే లో పాల్గొన్నాయి. ఇందులో మూడింట ఒక వంతు మంది గత ఏడాదిలో ఒక సారైనా తాము లంచం ఇచ్చినట్లు ఒప్పుకున్నారు. ఇలాంటి వారు 2005 లో 50 శాతం ఉండేవారని సిఎం ఎస్ చెప్పింది.
2016 నవంబర్ డిసెంబర్ నెలలలో, నోట్ల రద్దు సమయంలో అవినీతి తగ్గిందని సగానికంటే ఎక్కువ మంది చెప్పారు. ఈ 20 రాష్ట్రాలలో సర్వేలో పాల్గొన్న కుటుంబాలందించిన వివరాల ప్రకారం 2017లో రు.6,350 కోట్లు లంచం చేతులు మారింది. ఇది 2005లో రు. 20,500 కోట్లు.
సర్వే ప్రకారం పోలీసు శాఖలో ఎక్కవ అవినీతి ఉందని 34 శాతం మంది అభిప్రాయ పడ్డారు. తర్వాత స్థానం 24 శాతంతో రెవిన్యూ, హౌసింగ్ ది. న్యాయ శాఖలో అవినీతి గురించి 18శాతం ధృవీకరించారు.ప్రతికుటుంబం కనీసం వంద నుంచి 500 రుపాయల దాకా లంచం చెల్లించాల్సి వస్తున్నది. మహారాష్ట్రలో స్కూల్ అడ్మిషన్ ల కోసం రు 50 వేల లంచం చెలించాల్సి వస్తున్నది.
అయిదారు నెలల కిందటే ఎన్ సి ఇ ఎ ఆర్ (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనమిక్ రీసెర్చ్ ) కూడ ఇదే విషయాన్ని ప్రకటించింది. అపుడది అసెంబ్లీలో చర్చనీయాంశమయింది.
