ఏ రాష్ట్రరాజధానిలో కూడా లేనన్ని మెడికల్ కాలేజీలు అమరావతికి వస్తున్నాయి, ఇది ప్రపంచ రికార్డవుతుందేమో...
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి ప్రపంచంలో నెంబర్ వన్ అయిపోతున్నది. ఈ రికార్డు మెడికల్ కాలేజీల విషయంలో. మొదట ఇండియా రికార్డు. తర్వాత ప్రపంచరికార్డు. ఎందుకంటే, సమీప భవిష్యత్తులో 13 వైద్య కళాశాలలు ఏర్పాటు కానున్నాయి. ఇపుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇన్ని కళాశాలలు లేవు. అయితే, తొందర్లోనే ఇవన్నీ ఏర్పాటవుతాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ప్రస్తుతానికి భారత దేశంలో 13 మెడికల్ కాలేజీలు ఉన్న నగరం లేదేమో...ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మంగళవారం విజయవాడ ఎ ప్లస్ కన్వెన్షన్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని 31 మంది ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలను సత్కరించారు. రాష్ట్రాన్ని నాలెడ్జి సొసైటీగా, ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.ఈ సందర్భంగా 13 మెడికల్ కాలేజీల విషయం వెల్లడించారు.
‘‘దేశంలో ఎక్కడా లేనన్ని యూనివర్శిటీలు వస్తాయి. ఇప్పటికే శ్రీ రామస్వామి మెమోరియల్ (ఎస్.ఆర్.ఎం) ప్రారంభమైందని, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (VIT) ఇప్పటికే తరగతులు ప్రారంభించింది. అమృత్ వచ్చింది. ఇండో యు.కె ఆధారిత కింగ్స్ కళాశాల వైద్యశాల వచ్చింది. దుబాయ్కు చెందిన బి.ఆర్ షెట్టి వేయిపడకలతో కూడిన వైద్యశాల రానున్నది. దేశంలో మరే రాష్ట్ర రాజధానిలో కూడా ఒకే చోట ఇన్ని మెడికల్ కాలేజీలు లేవు,’’
