విజయనగరం జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి ప్రాంతంలో జరిగిన రైలు ప్రమాదంలో 35 మంది మృతిచెందారు.

విజయనగరం జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి ప్రాంతంలో జరిగిన రైలు ప్రమాదంలో 35 మంది మృతిచెందారు. జిల్లాలోని కొమరాడ వద్ద తెల్లవారు సుమారు 12 గంటల ప్రాంతంలో హీరాకుండ్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పటంతో ప్రమాదం సంభవించింది. ఛత్తీస్ ఘడ్ లోని జగదల్పూర్ నుండి బయలుదేరిన హీరాకుండ్ ఎక్స్ ప్రెస్ ఒడిస్సా లోని భువనేశ్వర్ వెళుతోంది. మార్గమద్యంలోని కొమరాడ వద్ద కూనేరు సమీపంలో పట్టాలు తప్పింది.

దాంతో ఇంజన్ సహా పలుభోగీలు పట్టాలు తప్పాయి. నాలుగు భోగీలు పక్క ట్రాక్ పైనే వెళుతున్న గూడ్సు రైలుపై పడ్డాయి. ఈ ప్రమాదంలో సుమారు 35 మరణించినట్లు ప్రాధమిక సమాచారం. తీవ్రంగా గాయపడిన సుమారు 65 మందిని వైజాగ్, పార్వతీపురం తదితర ప్రాంతాల్లోని ఆసుపత్రులకు తరలించారు. నాలుగు భోగీలు ప్రమాదంలో నుజ్జయిపోయాయి. రైలు భోగీలు పట్టాలు తప్పటం, పక్కనే వెళుతున్న గూడ్సు రైలుపై పడటంతో పెద్ద శబ్దం వచ్చింది. దాంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. వారే రైలు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. దాంతో సహాయచర్యలు ముమ్మరమయ్యాయి.

ప్రమాదం జరిగిన తీరుతో మావోయిస్టు దుశ్చర్య కూడా ఉందేమోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై రైల్వే మంత్రి సురేషప్రభు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. రైల్వేశాఖ అత్యున్నత విచారణకు ఆదేశించింది.