పోలీస్ స్టేషన్ లో రైతుల ఆత్మహత్యాయత్నం
- ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి వచ్చిన రైతులు
- ఆత్మహత్యకు పాల్పడిన రైతులు
- చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలింపు
విజయవాడ నున్న పోలీస్ స్టేషన్ లో ముగ్గురు కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటన కలకలం రేగింది. వెంట తెచ్చుకున్న పురుగుమందు తాగి రైతులు కుప్పకూలిపోయారు.
అసలేం జరిగిందంటే.. కౌలు రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం ఛలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఛలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొనేందుకు రైతులు అక్కడికి వచ్చారు. కాగా.. అసెంబ్లీ ముట్టడికి వచ్చిన రైతులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు.
సమస్య పరిష్కారం కోసం వస్తే.. పోలీసులు అరెస్టు చేయడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోయారు. దీంతో మనస్థాపానికి గురై ముగ్గురు రైతులు వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. నురుగలు కక్కుతూ పడిపోయిన వారిని పోలీసులు చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.