జీతం అడిగినందుకు.. ముక్కలు ముక్కలుగా నరికేశారు
16ఏళ్ల బాలిక దారుణ హత్య
పనిచేసిన దానికి జీతం డబ్బులు ఇవ్వాలని అడిగినందుకు దారుణంగా హత్య చేశారు. ఈ దారుణ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే...జార్ఖండ్కు చెందిన 16 ఏళ్ల బాలికకు పని కల్పిస్తానని మంజీత్ కర్కెటా అనే వ్యక్తి నమ్మించాడు. ఈ క్రమంలో మూడేళ్ల కిందట ఢిల్లీకి తీసుకెళ్లి ఓ ఇంట్లో పనికి కుదరిచ్చాడు. రెండేళ్లు బాగానే గడిచింది. ఆపై బాలికకు కష్టాలు మొదలయ్యాయి. జీతం డబ్బులను మంజీత్ తీసుకుని బాధితురాలికి ఇచ్చేవాడు కాదు. ఏడాదిగా జీతం డబ్బులు రాకపోవడంతో ఈ మే3న స్వగ్రామంలోని మంజీత్ ఇంటికి వెళ్లి నిలదీసింది. నన్నే డబ్బులు అడుగుతావా అంటూ మరో ఇద్దరి సాయంతో బాలికను హత్య చేశాడు. ఆపై మృతదేహాన్ని మూడు ముక్కలుగా నరికి డ్రైనేజీలో పడేయగా మే4న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. పక్క అపార్ట్మెంట్లో ఉండే మంజీత్ బాలిక హత్య జరిగినప్పటి నుంచీ అదృశ్యమైనట్లు గుర్తించారు. ఈ క్రమంలో మే17న ఢిల్లీలోని అద్దె ఇంటికి మంజీత్ వచ్చినట్లు సమాచారం అందుకున్న పోలీసులు అతడిపై నిఘా పెట్టారు. ఆదివారం ఆకస్మిక తనిఖీ చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. జీతం డబ్బులు అడిగినందుకే ఓ మహిళ సహా ఇద్దరి సాయంతో బాలికను హత్య చేసినట్లు అంగీకరించాడు.