లిక్కర్ డబ్బుల కోసం గొడవ.. నానమ్మ, తాతను చంపేసిన మనవడు
ఉత్తరప్రదేశ్లోని బదౌన్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మద్యానికి బానిస అయిన మనవడు.. లిక్కర్ కొనుగోలు చేయడానికి డబ్బులు అడిగి.. ఆ క్రమంలో జరిగిన వాగ్వాదంతో ఆగ్రహించి నానమ్మ, తాతను పొట్టన బెట్టుకున్నాడు. ఆ డెడ్ బాడీలను రెండు వేర్వేరు ఇళ్లల్లో దాచిపెట్టి ఊరి నుంచి పారిపోయాడు.
న్యూఢిల్లీ: ఆ యువకుడు మద్యానికి బానిస అయిపోయాడు. లిక్కర్ తాగనిదే ఊరుకునేవాడు కాదు. ఆ లిక్కర్ కొనుగోలు చేయడానికి డబ్బు కోసం ఎంతకైనా తెగబడేవాడు. ఈ విషయమై ఇంట్లో కుటుంబ సభ్యులతో తరుచూ గొడవ పడేవాడు. కానీ, ప్రాణాలు తీసేంత బానిస అని ఎవరూ అనుకోలేదు. కానీ, ఆ లిక్కర్ డబ్బుల కోసం యువకుడు తన నానమ్మ, తాతలను పొట్టనబెట్టుకున్నాడు. ఆ తర్వాత వారిద్దరి మృతదేహాలను రెండు వేర్వేరు గదుల్లో దాచి పెట్టి పరారయ్యాడు. పాక్షికంగా కుళ్లిన స్థితిలో ఆ రెండు డెడ్ బాడీలు కనిపించాయి. ఉత్తరప్రదేశ్లో జూన్ 22న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ప్రేమ్ శంకర్ (65), భవాని దేవి (60)లు తమ కుమారులతో ఢిల్లీలో నివసించేవారు. వారి ఒక కుమారుడు ఉత్తరప్రదేశ్లో ఉంటారు. ఒక పెళ్లి ఫంక్షన్లో పాల్గొనడానికి ఈ వృద్ధ దంపతులు కుమారులు, మనవళ్లతో ఉత్తరప్రదేశ్లోని మరో కుమారుడి వద్దకు వచ్చారు. బదౌన్ జిల్లా ఫైజ్ పోలీసు స్టేషన్ పరిధిలోని దామ్రి గ్రామానికి వచ్చారు.
ఈ గ్రామంలో ఉండగానే కుటుంబంతోపాటుగా వచ్చిన హిమేశ్.. నానమ్మ, తాతలను లిక్కర్ కోసం డబ్బులు అడిగాడు. లిక్కర్ కోసం డబ్బుల విషయమై గొడవ జరిగింది. ఈ గొడవ పరాకాష్టకు చేరింది. మనవడు హిమేశ్.. నానమ్మ, తాతలను చంపేశాడు. ఎవరికీ తెలియకుండా రెండు వేర్వేరు గదుల్లో వారి డెడ్ బాడీలను దాచేసి పరారయ్యాడు.
ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత మృతి చెందిన వృద్ధుల ఓ కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిమేశ్ ఆల్కహాలిక్ అని, లిక్కర్ కొనుగోలు చేయడానికి కుటుంబంలో తరుచూ గొడవ పెట్టుకునేవాడని ఎస్పీ (రూరల్) సిద్దార్థ తెలిపారు. లిక్కర్ కోసం డబ్బుల విషయమై వాగ్వాదం తర్వాత హిమేశ్.. ఇద్దరు వృద్ధులను జూన్ 22న చంపేశాడని వివరించారు.
అనంతరం నిందితుడు హిమేశ్ వారిద్దరి మృతదేహాలను రెండు వేర్వేరు ఇళ్లల్లో పెట్టి ఆ ఊరి నుంచి పారిపోయాడని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్టు చెప్పారు.