తమ్ముడు కుమారస్వామి నన్ను గౌరవించినందుకు థ్యాంక్స్: యడ్యూరప్ప
తమ్ముడు కుమారస్వామి తనను గౌరవిస్తూ మాట్లాడినందుకు కృతజ్ఞతలు అని ప్రతిపక్ష నేత యడ్యూరప్ప అన్నారు.
బెంగళూరు: తమ్ముడు కుమారస్వామి తనను గౌరవిస్తూ మాట్లాడినందుకు కృతజ్ఞతలు అని ప్రతిపక్ష నేత యడ్యూరప్ప అన్నారు. కర్ణాటక శాసనసభ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన రమేష్ కుమార్ ను అభినందిస్తూ మాట్లాడిన సందర్భంలో ఆయన శుక్రవారం ఆ విధంగా అన్నారు.
స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమయ్యేందుకు సహకరించిన ప్రతిపక్షానికి ముఖ్యమంత్రి కుమారస్వామి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెసుకు చెందిన రమేష్ కుమార్ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. రమేష్ కుమార్ అపార అనుభవం ఎంతో ఉపయోగపడుతుందని కుమారస్వామి అన్నారు. ప్రజా జీవితంలో ఉన్న అనుభవం శాసనసభా గౌరవాన్ని పెంచడానికి ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. సభ సజావుగా జరగడానికి తాము సహకరిస్తామని, ప్రతిపక్షాలకు స్పీకర్ తగిన సమయం ఇస్తారని ఆశిస్తున్నానని యడ్యూరప్ప అన్నారు.
శ్రీనివాసపురం నుంచి రమేష్ కుమార్ ఆరు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. 18 ఏళ్ల క్రితం ఆయన స్పీకర్ గా కూడా పనిచేశారు. సిద్ధరామయ్య మంత్రివర్గంలో పనిచేశారు.
కాంగ్రెసు శాసనసభా పక్ష నేత సిద్దరామయ్య కూడా రమేష్ కుమార్ ను అభినందిస్తూ మాట్లాడారు.