Presidential Election: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా.. అధికారిక ప్రకటన
విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా పేరు ఖరారు అయింది. మంగళవారం జరిగిన విపక్ష పార్టీల సమావేశంలో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా పేరు ఖరారు అయింది. మంగళవారం జరిగిన విపక్ష పార్టీల సమావేశంలో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. విపక్షాల నిర్ణయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అధికారికంగా ప్రకటించారు. ‘‘రాష్ట్రపతి ఎన్నికలకు ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా అని మేం (ప్రతిపక్ష పార్టీలు) ఏకగ్రీవంగా నిర్ణయించాం’’ అని జైరాం రమేష్ తెలిపారు. ఇక, జూన్ 27న ఉదయం 11.30 గంటలకు యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు చేయనున్నారు.
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో యశ్వంత్ సిన్హా మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్లో కొనసాగుతున్న యశ్వంత్ సిన్హా.. రాష్ట్రపతి పదవికి ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థిగా ఆయన పేరును ప్రతిపాదించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ రాజకీయాలకు దూరంగా ఉండి.. విస్తృత జాతీయ ప్రయోజనాల కోసం పని చేయాల్సిన సమయం ఆసన్నమైందని యశ్వంత్ సిన్హా పేర్కొన్నారు.
“టీఎంసీలో మమతా బెనర్జీ నాకు అందించిన గౌరవం, ప్రతిష్టకు నేను ఆమెకు కృతజ్ఞతలు చెబుతాను. ఇప్పుడు ఒక విస్తృత జాతీయ ప్రయోజనం కోసం, ప్రతిపక్ష ఐక్యత కోసం పని చేయడానికి నేను పార్టీకి దూరంగా ఉండాల్సిన సమయం వచ్చింది. ఆమె ఈ చర్యను ఆమోదిస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను’’ అని యశ్వంత్ సిన్హా ట్వీట్ చేశారు.
ఇక, రాష్ట్రపతి ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేకి వ్యతిరేకంగా.. ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి కోసం ఏకాభిప్రాయాన్ని రూపొందించడానికి ప్రతిపక్ష పార్టీల సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే 17 ప్రతిపక్ష పార్టీలకు ఆమె లేఖ రాశారు. ఈ క్రమంలోనే ప్రతిపక్ష పార్టీల సమావేశంలో రాష్ట్రపతి ఎన్నికలకు ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, మహాత్మా గాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ వారు ప్రతిపాదనను తిరస్కరించారు.
ఇక, తాజాగా ప్రతిపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పేరును ఖరారు చేశారు. శరద్ పవార్ ఏర్పాటు చేసిన సమావేశంలో విపక్ష నేతలు యశ్వంత్ సిన్హా పేరుపై ఏకీభవించారు. ఈ సమావేశానికి హాజరైన పార్టీలలో కాంగ్రెస్, NCP, TMC, CPI, CPI-M, సమాజ్వాదీ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్, AIMIM, RJD, AIUDFలు ఉన్నాయి.