రైల్వేలో తిరిగి విధుల్లోకి చేరిన రెజ్లర్లు.. ఆందోళనపై వెనక్కి తగ్గేది లేదంటూ వ్యాఖ్యలు
గత కొంత కాలం నుంచి డబ్లూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న టాప్ రెజ్లర్లు తిరిగి తమ ఉద్యోగాల్లో చేరారు. రైల్వే డిపార్ట్ మెంట్ లో తమ విధులు మొదలుపెట్టారు. అయితే తాము ఆందోళన విరమించలేదని, న్యాయం జరిగే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు.
రెజ్లింగ్ సమాఖ్య బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలో ముందంజలో ఉన్న భారత రెజ్లర్లు సక్షి మాలిక్, వినేశ్ ఫోగట్, బజరంగ్ పూనియాలు రైల్వేలో తిరిగి తమ విధుల్లో చేరారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న రెజ్లర్లను పోలీసులు మే 31వ తేదీన ఖాళీ చేయించారు. ఈ పరిణామం జరిగిన కొద్ది రోజులకే టాప్ రెజ్లర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే నిరసన నుంచి తప్పుకుంటున్నట్లు వస్తున్న వార్తలను సాక్షి మాలిక్, బజరంగ్ పునియా ఖండించారు. ‘ఇది న్యాయం కోసం మా పోరాటం. మేం వెనక్కి తగ్గేది లేదు’ అని స్పష్టం చేశారు.
దేశ ప్రతిష్ట రాహుల్ గాంధీకి అర్థం కావడం లేదు - బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా
రైల్వేలో తిరిగి విధుల్లో చేరామని, అయితే భవిష్యత్ వ్యూహాలపై కూడా కసరత్తు చేస్తున్నామని చెప్పారు. ఈ మేరకు బజరంగ్ పూనియా ఓ వీడియో సందేశం విడుదల చేశారు. అందులో అథ్లెట్లు కలిసికట్టుగానే ఉన్నారని, తమ ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసేందుకే కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. ‘‘అథ్లెట్లపై జరుగుతున్న అసత్యాలను తిప్పికొట్టేందుకు వచ్చాను. మా మధ్య ఎలాంటి విభేదాలూ లేవు. ఏ కేసును ఉపసంహరించుకోలేదు. అందరం కలిసి పోరాడుతున్నాం. మా పోరాటాన్ని నిర్వీర్యం చేయడానికి, అసత్యాలను ప్రచారం చేయడానికి దృష్టి పెట్టకండి’’ అని పూనియా అన్నారు.
మైనర్ సహా ఏడుగురు మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై నిష్పక్షపాత విచారణ జరిపించాలని కోరుతూ రెజ్లర్లు శనివారం సాయంత్రం హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా అమిత్ షా ‘చట్టం అందరికీ ఒకేలా ఉంటుంది. చట్టాన్ని తన పని తాను చేసుకోనివ్వండి’ అని రెజ్లర్లతో అన్నట్టు తెలిసింది. కాగా.. దీనిపై సాక్షి మాలిక్ స్పందిస్తూ.. అమిత్ షాతో తాము సాధారణ సంభాషణ జరిపామని తెలిపారు. బ్రిజ్ భూషణ్ సింగ్ ను అరెస్టు చేయాలనేది మాత్రమే తమ డిమాండ్ అని, తమకు న్యాయం జరిగే వరకు నిరసనను కొనసాగిస్తామని చెప్పారు.
విద్యార్థినులపై నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపల్ లైంగిక వేధింపులు.. విజయవాడలో ఆందోళన చేపట్టిన బాలికలు
కాగా.. ప్రభుత్వం తమ నిరసనను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ గత నెలలో హరిద్వార్ లోని గంగా నదిలో తమ పతకాలను నిమజ్జనం చేయాలని నిర్ణయించుకున్నట్లు రెజ్లర్లు ప్రకటించారు. అయితే రైతు నాయకుడు నరేష్ తికాయత్ జోక్యంతో వారు తమ ప్రణాళికను తాత్కాలికంగా విరమించుకున్నారు. అంతకు ముందు మే 28వ తేదీన కొత్త పార్లమెంటు ప్రారంభోత్సం సందర్భంగా రెజ్లర్లు అల్లర్లకు పాల్పడ్డారని, ఎన్నిసార్లు చెప్పినప్పటికీ వారు ఉన్మాదంగా ప్రవర్తిస్తూ చట్టాన్ని ఉల్లంఘించారని ఢిల్లీ పోలీసులు ఆరోపించారు. అయితే అదే రోజు ఢిల్లీ పోలీసులు పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఛాంపియన్ వినేశ్ ఫోగట్, ఆమె బంధువు సంగీతా ఫోగట్ ను పోలీసులు నేలపైకి తోసేసిన దృశ్యాలు దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతిని, ఆగ్రహాన్ని రేకెత్తించాయి.