పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు పదే పదే వాయిదా పడుతూ వుండటంతో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై తాను లోక్సభకు రానని ఆయన స్పష్టం చేశారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు పదే పదే వాయిదా పడుతూ వుండటంతో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికార, ప్రతిపక్ష సభ్యులు సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. ఇరుపక్షాలు తమ తీరును మార్చుకునే వరకు తాను లోక్సభకు రానని ఓం బిర్లా స్పష్టం చేశారు.
మరోవైపు.. ప్రతిపక్ష కూటమి ఇండియా పార్లమెంటులో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 8వ తేదీన ఈ తీర్మానంపై లోక్ సభలో చర్చ మొదలు కానుంది. మూడు రోజులపాటు అంటే 10వ తేదీ వరకు ఈ చర్చ సాగుతుంది. చివరి రోజున అంటే 10వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమాధానం ఇవ్వనున్నారు. లోక్ సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నిర్ణయాలు జరిగాయని ఓ నేత చెప్పారు.
ALso Read: పార్లమెంటులో 8న అవిశ్వాస తీర్మానంపై చర్చ.. 10న ప్రధాని మోడీ సమాధానం
బీఏసీ మీటింగ్ నుంచి కూడా ఇండియా కూటమి నేతలు వాకౌట్ చేయడం గమనార్హం. అవిశ్వాస తీర్మానానికి ప్రాధాన్యత ఇచ్చి తక్షణమే జరప లేదని నిరసనగా ఈ ఎంపీలు వాకౌట్ చేశారు. అవిశ్వాస తీర్మానంపై బుధవారం చర్చ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయగా.. ప్రభుత్వం నిరాకరించింది. ఇంతలో కొన్ని బిల్లులనూ పాస్ చేయించుకుంది. అయితే.. అవిశ్వాస తీర్మానం పెండింగ్లో ఉండగా బిల్లులు పాస్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఇండియా నేతలు అన్నారు.
మణిపూర్ హింసపై పార్లమెంటులో చర్చ చేయాలని, అందుకు తగిన సమయం కేటాయించాలని, అలాగే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంటులో ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్న కూడా పార్లమెంటులో ఈ విషయమై ఆందోళనలు చేశారు. 16వ లోక్ సభ(2014 నుంచి 2019 వరకు ఉన్న లోక్ సభ)లో టీడీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా మరుసటి రోజే చర్చ జరిపారని లోక్ సభలో కాంగ్రెస్ విప్ మాణిక్కం ఠాగూర్ గుర్తు చేశారు. మరి ఇప్పుడు ఎందుకు చర్చించడం లేదని ప్రశ్నించారు. తమ డిమాండ్ను ప్రభుత్వం ఖాతరు చేయలేదని, అందుకే నిరసనగా వాకౌట్ చేసినట్టు ఎంపీ టీఆర్ బాలు వెల్లడించారు.
