నాలుగు డోసులు వ్యాక్సిన్ వేయించుకున్న మహిళకు కరోనా పాజిటివ్.. ఫ్లైట్ ఎక్కకుండా అడ్డుకున్న అధికారులు
కరోనా వైరస్పై (Coronavirus) పోరులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ (Vaccination) ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే వ్యాక్సిన్లు వేయించుకున్నవారిని కూడా కరోనా వైరస్ వదలడం లేదు. తాజాగా నాలుగు డోసులు వ్యాక్సిన్ వేయించుకున్న ఓ మహిళకు COVID-19 పాజిటివ్గా నిర్దారణ అయింది.
కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే వ్యాక్సిన్లు వేయించుకున్నవారిని కూడా కరోనా వైరస్ వదలడం లేదు. కొత్తగా ఒమిక్రాన్ టెన్షన్ కూడా జనాలకు భయపెడుతుంది. తాజాగా నాలుగు డోసులు వ్యాక్సిన్ వేయించుకున్న ఓ మహిళకు COVID-19 పాజిటివ్గా నిర్దారణ అయింది. ఈ ఘటన ఇండోర్ విమానాశ్రయంలో (Indore airport) వెలుగుచూసింది. మహిళకు ఎయిర్పోర్ట్లో కరోనా పాజిటివ్గా తేలడంతో.. ఆమెను దుబాయ్ వెళ్లే విమానం ఎక్కకుండా అడ్డుకున్నట్టుగా అధికారులు బుధవారం తెలిపారు.
వివిధ వ్యాక్సిన్లను నాలుగు డోసులు పొందిన దాదాపు 30 ఏళ్ల వయసు గల మహిళను విమానశ్రయంలో పరీక్షించగా కోవిడ్ నిర్దారణ అయిందని ఇండోర్ చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ భూరే సింగ్ సెటియా (Dr Bhure Singh Setia) తెలిపారు. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చేరిందని.. ఎటువంటి లక్షణాలు లేవని చెప్పారు. అయితే ఒక్కరోజు ముందు నిర్వహించిన పరీక్షల్లో ఆమె కరోనా నెగిటివ్గా నిర్దారణ అయినట్టుగా చెప్పారు.
ఆ మహిళ సమీప బంధువు వివాహానికి హాజరయ్యేందుకు 12 రోజుల క్రితం ఇండోర్ సమీపంలోని మహో పట్టణానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. బుధవారం ఆమె దుబాయ్కి తిరిగి వెళ్తున్నప్పుడు ప్రామాణిక పద్ధతి ప్రకారం ఆమెకు ర్యాపిడ్ ఆర్టీపీసీఆర్ పరీక్ష చేశారు. అందులో పాజటివ్గా తేలడంతో చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఇండోర్-దుబాయ్ వీక్లి సర్వీస్లో ప్రయాణించేవారికి ఎయిర్పోర్ట్లో RT-PCR పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని అధికారులు చెప్పారు. అందులో భాగంగానే బుధవారం 89 మందిని పరీక్షించినట్టుగా తెలిపారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ..ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు మధ్య కాలంలో ఆ మహిళ నాలుగు సార్లు వ్యాక్సిన్ వేయించుకున్నారు. సినోఫార్మ్, ఫైజర్స్ వ్యాక్సిన్లు రెండు డోస్ల చొప్పున తీసుకున్నారు.
ఇక, దేశంలో కరోనా కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో 13,154 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇది క్రితం రోజు నమోదైన 9,195 కేసులతో పోలిస్తే.. 43 శాతం ఎక్కువ. ఇక, తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,48,22,040కి పెరిగింది. తాజాగా కరోనాతో 268 మృతిచెందగా.. దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,80,860కి చేరుకుంది. గత 24 గంటల్లో కరోనా నుంచి 7,486 మంది కోలుకోగా.. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 3,42,58,778కి చేరింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 82,402 గా ఉంది.