రాజస్థాన్‌లోని ఉదయ్‌‌పూర్‌లో నిర్మాణంలో వున్న దేవాలయం పై భాగంలో చెట్టుకు వేలాడుతూ ఓ మహిళ మృతదేహం కనిపించింది. ఏకలీంపుర ప్రాంతంలోని జ్యోతా బావ్‌జీ ఆలయం వద్ద ఈ ఘటన జరిగింది. 

రాజస్థాన్‌లోని ఉదయ్‌‌పూర్‌లో నిర్మాణంలో వున్న దేవాలయం పై భాగంలో చెట్టుకు వేలాడుతూ ఓ మహిళ మృతదేహం కనిపించింది. ఏకలీంపుర ప్రాంతంలోని జ్యోతా బావ్‌జీ ఆలయం వద్ద నిర్మాణ పనులు జరుగుతుండగా.. కూలీలు ఆలయ టెర్రస్ పైకి వెళ్లారు. ఈ నేపథ్యంలో అక్కడ చెట్టుకు వేలాడుతున్న మహిళ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆలయం వద్దకు చేరుకున్న పోలీసులు.. మహిళ మృతదేహాన్ని కిందకి దించి పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

మీడియాలో వస్తున్న కథనాలను బట్టి మృతురాలిని ఆలయం వెనుక వున్న బస్తీలో నివసించే పుష్పగా గుర్తించారు. ఈమె కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తుందని సమాచారం. అయితే గత రాత్రి నుంచి కనిపించకుండాపోయిన పుష్ప.. బుధవారం ఉదయం ఆలయం పైన వున్న చెట్టుకు వురివేసుకుని వేలాడుతూ కనిపించింది. ఇది ఆత్మహత్యా లేక హత్యా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఆమె మరణానికి కారణమైన నిందితులను వెంటనే పట్టించుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.