మత్తు ఇంజెక్షన్ తీసుకుని మహిళా డాక్టర్ ఆత్మహత్య.. టెన్షన్ తట్టుకోలేకే అంటూ..
తాను మానసికంగా దృఢంగా లేనని, టెన్షన్ని తట్టుకోలేక పోతున్నానని.. రాసి ఓ మహిళా డాక్టర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన భోపాల్ లో వెలుగు చూసింది.
భోపాల్ : భోపాల్లో ఓ మహిళా డాక్టర్ నాలుగు డోసుల మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని గాంధీ మెడికల్ కాలేజీ (జిఎంసి) హాస్టల్లో 24 ఏళ్ల మహిళా డాక్టర్ అనస్థీషియా మందు ఇంజెక్ట్ చేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసు అధికారి గురవారం తెలిపారు.
బుధవారం సాయంత్రం ఆకాంక్ష మహేశ్వరి అనే మహిళ తన హాస్టల్ గదిలోనే ఆత్మహత్య చేసుకుంది. ఆ మహిళ మృతదేహాన్ని అక్కడినుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఆ తరువాత పోలీసులు ఆ గది నుండి ఖాళీ ఇంజెక్షన్ బాటిల్స్, సిరంజిని స్వాధీనం చేసుకున్నారు, కోహ్-ఇ-ఫిజా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ విజయ్ సిసోడియా మాట్లాడుతూ, మహిళ 2.5 ఎం.ఎల్. చొప్పున నాలుగు డోసుల అనస్థీషియాను తీసుకుందని తెలిపారు.
ఆ గదిలో ‘తాను మానసికంగా దృఢంగా లేనని, టెన్షన్ని తట్టుకోలేకపోతున్నానని’ ఆమె రాసిన సూసైడ్ నోట్ లభించింది. వ్యక్తిగత కారణాలతోనే ఈ తీవ్రమైన నిర్ణయానికి వచ్చినట్లు ఆమె పేర్కొన్నారని, దీనికి ఎవరూ బాధ్యులు కాదని ఆయన అన్నారు. ఆ మహిళ తన తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పినట్లు కూడా ఆ నోట్లో పేర్కొంది.
ఆకాంక్ష మహేశ్వరి ప్రభుత్వ ఆధ్వర్యంలోని నడుస్తున్న జీఎంసీలో పీడియాట్రిక్స్ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ను చదువుతోంది. ఈ కోర్సు మొదటి సంవత్సరం విద్యార్థి అని ఆయన చెప్పారు.హాస్టల్ లోని ఇతర విద్యార్థుల కథనం మేరకు.. బుధవారం ఉదయం నుండి మహిళ గది తలుపులు మూసి ఉన్నాయి. సాయంత్రం తిరిగి వచ్చేసరికి కూడా అలాగే మూసి ఉండటంతో వారు ఆశ్చర్యానికి గురయ్యారు. దాని గురించి సెక్యూరిటీ గార్డు, మెడికల్ మేనేజ్మెంట్ లను అప్రమత్తం చేసినట్లు అధికారి తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బలవంతంగా తలుపులు తెరిచి చూడగా గదిలో మహిళ శవమై పడి ఉందని తెలిపారు. ఆమె గ్వాలియర్ నివాసి. ఒక నెల క్రితం జీఎంసీలో చేరింది. బుధవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఆమె తన కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు అధికారి తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారి తెలిపారు.