‘యూపీ పరిస్థితుల్లో మార్పు వచ్చిందా?’ రాహుల్ యాత్రకు రామ మందిర ప్రధాన అర్చకుడు, సెక్రెటరీ మద్దతుపై జైరాం రమేశ్
ఉత్తరప్రదేశ్లోకి ప్రవేశించిన రాహుల్ గాంధీ సారథ్యంలో సాగుతున్న భారత్ జోడో యాత్రపై రామ మందిర ట్రస్టీల నుంచి మంచి ఆదరణ లభించింది. వారు ఈ యాత్రకు మద్దతు తెలిపారు. దీనిపై కాంగ్రెస్ మీడియా ఇంచార్జీ జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. యోగి రాష్ట్రంలో ఇవి మార్పునకు సంకేతాలేనా? అని పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ బుధవారం ఉత్తరప్రదేశ్ పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామజన్మభూమిలోని మందిరం ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్, జనరల్ సెక్రెటరీ చంపత్ రాయ్లు రాహుల్ సారథ్యంలో సాగుతున్న భారత్ జోడో యాత్రకు మద్దతు తెలుపడం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. యూపీలో పరిస్థితుల్లో మార్పులు వచ్చాయా? అవే సంకేతాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.
భారత్ జోడో యాత్ర ఉత్తరప్రదేశ్లోకి ప్రవేశించిన తర్వాత సత్యేంద్ర దాస్ రియాక్ట్ అయ్యారు. ఈ యాత్ర ఫలప్రదం కావడానికి ఆయనకు రాముడి ఆశీస్సులు ఉంటాయని అన్నారు. అంతేకాదు, దేశాన్నీ ఐక్యం చేయాలనే కార్యక్రమాన్ని పేర్కొంటూ ఆయన రాహుల్ గాంధీకి ఒక లేఖ కూడా రాశారు.
మీరు పోరాడుతున్న మిషన్ విజయవం కావాలని ఆశిస్తున్నాను. మీరు దీర్ఘకాలలం జీవించాలని దీవిస్తున్నా.. అంటూ దాస్ లేఖ రాశారు. మీరు చేస్తున్న పనులన్నీ ప్రజల మంచి కోసమే చేస్తున్నారు. శ్రీరాముడి దీవెనలు నీ వెంటే ఉంటాయి.. అని తెలిపారు.
Also Read: భారత్ జోడోను ఎవరూ వ్యతిరేకించలేరు: రామ మందిర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ
అనంతరం, రామ మందిరం ట్రస్ట్ సెక్రెటరీ చంపత్ రాయ్ కూడా భారత్ జోడో యాత్ర గురించి మాట్లాడారు. ‘దేశంలో పాదయాత్ర చేస్తున్న ఆ యంగ్ మ్యాన్కు ధన్యవాదాలు. ఆయన కార్యక్రమాన్ని ప్రశంసిస్తున్నాను. ఇందులో తప్పేమీ లేదు. నేను ఆర్ఎస్ఎస్ వర్కర్ను. ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ భారత్ జోడో యాత్రను ఖండించలేదు’ అని అన్నారు. ‘ఆయన కఠిన వాతావరణంలో నడుస్తుండటం ప్రశంసనీయం. ప్రతి ఒక్కరూ దేశం కోసం యాత్ర చేయాలి.. భారత్ జోడోకు ఎవ్వరూ వ్యతిరేకి కాదు. ఆ యాత్రలో తప్పేమీ లేదు. నేను ఆ యాత్రను ప్రశంసిస్తున్నాను’ అని చంపత్ రాయ్ అయోధ్యలో విలేకరులతో చెప్పారు.
రామ మందిర ట్రస్టీలు భారత్ జోడో యాత్రకు మద్దతు తెలిపిన నేపథ్యంలో జైరాం రమేశ్ ట్విట్టర్లో రియాక్ట్ అయ్యారు. యోగి ఆదిత్యానాథ్ రాష్ట్రంలో వాతావరణంలో మార్పులకు ఇది సంకేతంగా ఉన్నదని తెలిపారు.