Kashmiri migrants: కాశ్మీరీ వలసదారుల ఆస్తులను పునరుద్ధరిస్తామని కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ వెల్లడించారు. కాశ్మీరీ వలసదారుల ఆస్తులకు జిల్లా మేజిస్ట్రేట్ను సంరక్షకుడిగా నియమించినట్లు ఆయన రాజ్యసభకు తెలిపారు. వలసదారుల ఫిర్యాదుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం పోర్టల్ను కూడా ప్రారంభించిందని పేర్కొన్నారు.
Jammu Kashmir : కాశ్మీరీ వలసదారుల ఆస్తులను పునరుద్ధరించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం సమర్ధవంతంగా పనిచేస్తున్నదనీ, ఇప్పటివరకు 610 మంది దరఖాస్తుదారుల ఆస్తులను తిరిగి ఇచ్చామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ బుధవారం రాజ్యసభలో తెలిపారు. ఎగువ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. వలసదారుల ఆస్తుల సంరక్షకుడిగా జిల్లా మేజిస్ట్రేట్ను నియమించినట్లు తెలిపారు. వలసదారుల ఫిర్యాదుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం పోర్టల్ను కూడా ప్రారంభించిందన్నారు.
వలస వచ్చిన కాశ్మీరీలకు ఆస్తులను తిరిగి ఇచ్చేయడానికి ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు సమర్థవంతంగా చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. దీని కోసం నిరంతరం ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. వలసదారుల ఫిర్యాదులో వాస్తవాలు.. నిజమైనవిగా ఉంటే వారి ఆస్తులు తిరిగి ఇవ్వబడతాయి. ఇప్పటి వరకు 610 మంది దరఖాస్తుదారుల ఆస్తులను తిరిగి ఇచ్చేశాము అని తెలిపారు. అలాగే, జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిపథంలో పయనిస్తోందని తెలిపారు. పారిశ్రామిక అభివృద్ధికి రాష్ట్రానికి 51,000 కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదన వచ్చిందని, దీనివల్ల 4.50 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
దాదాపు 13 రోడ్ల నిర్మాణం రాష్ట్రంలో మెరుగైన రీచ్ను అందించింది. 2019కి ముందు రోజుకు 6.54 కి.మీ.గా ఉన్న నిర్మాణ వేగం ఇప్పుడు రోజుకు 20.68 కి.మీలకు పెరిగింది. 1,000 మందికి పైగా నివసించే గ్రామం రోడ్లతో అనుసంధానించబడి ఉంది. 2023 నాటికి 500 మందితో కూడిన ఒక కుగ్రామానికి కూడా రోడ్డు కనెక్షన్ వస్తుందని ఆయన తెలిపారు.పెరుగుతున్న నిరుద్యోగంపై విషయంలో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజల్లో ఉపాధి, విశ్వాసం పెరిగిందన్నారు. రాష్ట్రంలో 2019 నుంచి ఇప్పటి వరకు 26,303 పోస్టులను గుర్తించారు. నియామక ప్రక్రియ కొనసాగుతోందని, రాష్ట్రంలో ఎంప్లాయిమెంట్ పోర్టల్ ఏర్పాటు చేశామని, కౌన్సెలింగ్ సెక్షన్లు, కెరీర్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు.
వలస కాశ్మీరీలకు వాగ్దానం చేసిన ఉద్యోగాలపై మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం 2020-21లో 841 మందికి మరియు 2021-22లో 1,264 మందికి ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పారు. తమ సొంత రాష్ట్రంలో తిరిగి స్థిరపడాలనుకునే వలస కాశ్మీరీలకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. 2019 నుండి జమ్మూ కాశ్మీర్లో 14 మంది హిందువులలో నలుగురు కాశ్మీరీ పండిట్లను ఉగ్రవాదులు చంపారని మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. జమ్మూకశ్మీర్లో గత ఐదేళ్లలో మైనారిటీ వర్గాలకు చెందిన 34 మందిని ఉగ్రవాదులు హతమార్చారని తెలిపారు.
జమ్మూకాశ్మీర్ అభివృద్ధికి అనేక ప్రాజెక్టులు చేపట్టామని తెలిపారు. ఈ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేయాడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనేక ప్రాజెక్టులు అమలు చేయబడ్డాయి. పూర్తయిన వాటిని పరిశీలించి, ఏవైనా అంతరాలు ఉంటే వాటిని పరిష్కరిస్తామని, త్వరలోనే అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పారు. అలాగే, ప్రస్తుతం జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాద ఘటనలు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. "ప్రభుత్వానికి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా policy of zero-tolerance విధానం ఉందని తెలిపారు. 2018 లో 417 నుండి 2019 లో 255 కు, 2020 లో 244 మరియు 2021 లో 229 కి తీవ్రవాద దాడులు గణనీయంగా తగ్గాయని మంత్రి నిత్యానంద రాయ్ వెల్లడించారు.
