Asianet News TeluguAsianet News Telugu

నీతి ఆయోగ్ స‌మావేశంలో ఎంఎస్‌పీ అంశాన్ని లేవ‌నెత్తుతాను: పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్

NITI Aayog meeting: గత మూడు సంవత్సరాలుగా నీతి ఆయోగ్ సమావేశానికి హాజ‌రుకాకుండా దాటవేసిన మాజీ ముఖ్య‌మంత్రులు చరణ్‌జిత్ సింగ్ చన్నీ, కెప్టెన్ అమరీందర్ సింగ్‌లపై పంజాబ్ ముఖ్య‌మంత్రి, ఆప్ నాయ‌కుడు భగవంత్ సింగ్ మాన్  విమ‌ర్శ‌లు గుప్పించారు. 
 

Will raise MSP issue in NITI Aayog meeting; says, Punjab CM Bhagwant Mann
Author
Hyderabad, First Published Aug 7, 2022, 4:08 AM IST

Punjab CM Bhagwant Mann: ప్ర‌ధాని మంత్రి న‌రేంద్ర మోడీ అధ్య‌క్ష‌త‌న ఆదివారం నాడు దేశ రాజ‌ధాని ఢిల్లీలో నీతి ఆయోగ్ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. పంటల వైవిధ్యం, నూనెగింజలు, పప్పుధాన్యాలు, వ్యవసాయ వర్గాలలో స్వయం సమృద్ధి సాధించడం వంటి అంశాలపై ముఖ్యమంత్రులతో చర్చించేందుకు నీతి ఆయోగ్ పాలక మండలి ఏడవ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షత వహించనున్నారు. రెండు సంవత్సరాల విరామం తర్వాత రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌లో జరగనున్న కౌన్సిల్ మొదటి భౌతిక సమావేశంలో పాఠశాల విద్య, ఉన్నత విద్య కోసం జాతీయ విద్యా విధానం, పట్టణ పరిపాలన, ఇతర వాటిపై కూడా చర్చించనున్నారు. అయితే, ఇప్ప‌టికే ఈ స‌మావేశాన్ని ప‌లువురు సీఎం బ‌హిష్క‌రించ‌గా.. మ‌రికొంత మంది హాజ‌రుకావ‌డం లేద‌ని స‌మాచారం. కేంద్ర ప్ర‌భుత్వం త‌మ రాష్ట్రాల ప‌ట్ల నిర్ల‌క్ష్యంగా ఉంటున్న‌ద‌నే కార‌ణంతోనే ఈ నిర్ణ‌యాలు తీసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. 

ఈ క్ర‌మంలోనే పంజాబ్ ముఖ్య‌మంత్రి, ఆమ్ ఆద్మీ నాయ‌కుడు భ‌గ‌వంత్ సింగ్ మాన్.. నీతి ఆయోగ్ స‌మావేశానిక సంబంధించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆదివారం న్యూఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పంటలు, వ్యవసాయ రుణాలు, కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) కి చట్టపరమైన హామీతో సహా పలు అంశాలను లేవనెత్తుతానని ఆయ‌న తెలిపారు. శనివారం చండీగఢ్‌లో మీడియాతో మాట్లాడిన భ‌గ‌వంత్ మాన్.. పంజాబ్ మాజీ ముఖ్య‌మంత్రుల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. చ‌ర‌ణ్‌జిత్ సింగ్ చన్నీ, కెప్టెన్ అమరీందర్ సింగ్ ఇంతకుముందు ఇలాంటి సమావేశాలకు హాజరు కాలేదని మండిపడ్డారు. కీల‌క అంశాల‌ను లేవ‌నెత్త‌డంలో విఫ‌ల‌మ‌య్యార‌ని ఆరోపించారు. ప్రభుత్వ అపెక్స్ పాలసీ థింక్ ట్యాంక్ అయిన నీతి ఆయోగ్ ఏడో పాలక మండలి సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షత వహించనున్నారు. “నేను నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాబోతున్నాను. పంజాబ్ సమస్యలపై నేను నా హోంవర్క్ చేసాను.. అది మీటింగ్‌లో చెప్పబోతున్నాను” అని భ‌గ‌వంత్ మాన్ చెప్పారు.

నీతి ఆయోగ్ సమావేశానికి పంజాబ్ నుంచి ఏ ప్రతినిధి అయినా హాజరు కావడం మూడేళ్ల తర్వాతే జ‌రుగుతున్న‌ద‌ని ఆయన అన్నారు. "నేను నీరు, రైతుల రుణం, MSPకి చట్టపరమైన హామీ, కాలువ వ్యవస్థ, బుద్ధ నల్లా' (లూథియానాలో), BBMB (భాక్రా బియాస్ మేనేజ్‌మెంట్ బోర్డ్), ఆరోగ్య సంబంధిత విషయాలను లేవనెత్తుతాను" అని భ‌గ‌వంత్ మాన్ చెప్పారు. ఢిల్లీలో పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను కలవడానికి ప్రయత్నిస్తానని, అమృత్‌సర్, మొహాలీ విమానాశ్రయాల నుండి లండన్, చికాగో, శాన్ ఫ్రాన్సిస్కో, వాంకోవర్‌లకు నేరుగా అంతర్జాతీయ విమానాల సమస్యను లేవనెత్తుతానని ముఖ్యమంత్రి చెప్పారు. కేంద్రం ఏర్పాటు చేసిన ఎంఎస్‌పీ కమిటీపై అడిగిన ప్రశ్నకు ఆయ‌న సమాధానమిస్తూ.. ఇప్పుడు రద్దు చేసిన వ్యవసాయ చట్టాలకు అనుకూలంగా ఉన్న వారి కంటే రైతు ప్రతినిధులను ప్రభుత్వం చేర్చుకోవాలని అన్నారు. గత నెలలో కేంద్రం ఎంఎస్‌పీపై కమిటీని వేసింది. ఈ వ్యవస్థను మరింత ప్రభావవంతంగా, పారదర్శకంగా చేయడం ద్వారా రైతులకు ఎంఎస్‌పీని అందుబాటులోకి తెచ్చే మార్గాలను కమిటీ పరిశీలిస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios