రాహుల్ గాంధీ ఇప్పుడు క్షమాపణ చెబుతారా ?- నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు ఉత్తర్వులపై బీజేపీ
కేంద్ర ప్రభుత్వం ఆరేళ్ల కిందట తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ నేపథ్యంలో బీజేపీ కాంగ్రెస్ పై మండిపడింది. నోట్ల రద్దు నిర్ణయంపై రాహుల్ గాంధీ తప్పుగా మాట్లాడారని, ఇప్పుడు ఆయన క్షమాపణలు చెబుతారా అని ప్రశ్నించింది.
ప్రభుత్వ నోట్ల రద్దు చర్యను చారిత్రకమైనదిగా సమర్థిస్తూ సుప్రీంకోర్టు సోమవారం ఇచ్చిన తీర్పును బీజేపీ ప్రశంసించింది. నోట్ల రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని నిందించింది. ఈ తీర్పు వెలువడిన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇప్పుడు క్షమాపణలు చెబుతారా అని ప్రశ్నించింది.
నిబంధనలు పాటించని అకౌంట్లపై ట్విట్టర్ కొరడా.. భారత్లో 48,624 ఖాతాలపై నిషేధం..
ఈ మేరకు బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. 2016లో జరిగిన పెద్దనోట్ల రద్దు తీవ్రవాద నిధులను అరికట్టిందని, ఇది ఉగ్రవాదానికి అతిపెద్ద దెబ్బ అని రుజువు చేసిందని ఆయన నొక్కి చెప్పారు. ఇది ఆదాయపు పన్నును పెంచిందని, ఆర్థిక వ్యవస్థను శుభ్రపరిచిందని ఆయన పేర్కొన్నారు.
‘‘ ఇది చారిత్రాత్మక నిర్ణయం. దేశ ప్రయోజనాలకు సంబంధించినది. జాతీయ ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయం చెల్లుబాటు అవుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా చేసిన ప్రచారానికి రాహుల్ గాంధీ ఇప్పుడు క్షమాపణ చెబుతారా ? విదేశాలలో కూడా దానికి (రాహుల్ గాంధీ) వ్యతిరేకంగా మాట్లాడారు’’ అని ఆయన తెలిపారు.
కోర్టు మైనారిటీ తీర్పుపై సంతోషం వ్యక్తం చేస్తున్నామని చెప్పిచన కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరంపై కూడా ప్రసాద్ మండిపడ్డారు. చిదంబరం మెజారిటీ తీర్పును నిర్లక్ష్యానికి గురిచేస్తూ అసాంఘిక ప్రకటనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. డీమోనిటైజేషన్ తర్వాత ఊపందుకున్న డిజిటల్ చెల్లింపుల్లో భారతదేశం గ్లోబల్ లీడర్గా అవతరించిందని అన్నారు. ఈ ఏడాది అక్టోబర్లోనే రూ. 12 లక్షల కోట్లకు పైగా డిజిటల్ లావాదేవీలు జరిగాయని అన్నారు.
కేరళ వాసులను హడలెత్తిస్తున్న వీధి కుక్కలు.. వరుస దాడులతో ఆందోళన
ఈ తీర్పుతో విభేదించిన న్యాయమూర్తి కూడా ఈ విధానం సదుద్దేశంతో కూడుకున్నదని చెప్పారని రవి శంకర్ ప్రసాద్ గుర్తుచేశారు. కాగా.. ఆర్థిక విధాన విషయాల్లో చాలా సంయమనం పాటించాలని, తన నిర్ణయాన్ని న్యాయసమీక్ష చేయడం ద్వారా కార్యనిర్వాహక వర్గం వివేకాన్ని భర్తీ చేయలేమని జస్టిస్ ఎస్ఏ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది.
రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ ఆరేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సోమవారం 4:1 మెజారిటీతో సమర్థించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు పలువురు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఈ వ్యాఖ్యలు చేశారు.