తాగుబోతు భర్తను హతమార్చిన భార్య, పిల్లల సాయంతో....
బెంగళూరులో దారుణం...
నిత్యం తాగిన మైకంలో వేధింపులకు గురిచేస్తున్న భర్తను ఓ భార్య దారుణంగా హతమార్చింది. తన తో పాటు పిల్లలపై కూడా దాడి చేయడాన్ని ఆ తల్లి తట్టుకోలేకపోయింది. దీంతో తన ఇద్దరు పిల్లల సాయంతో భర్తను హత్య చేసింది. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరు లో చోటుచేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బెంగళూరు లోని చంద్రా లేఅవుట్ ప్రాంతానికి చెందిన పళనివేలు, కవితలు దంపతులు. వీరికి ఇద్దరు కొడుకులు. అయితే మద్యానికి బానిసైన పళనివేలు నిత్యం తాగొచ్చి భార్యను, పిల్లలను చితకబాదేవాడు. దీంతో అతడిపై భార్య, పిల్లలు కోపాన్ని పెంచుకున్నారు.
ఇటీవల అతడి వేధింపులు మరీ ఎక్కువయ్యాయి. దీంతో అతడిని హతమార్చడానికి భార్యా పిల్లలు ప్లాన్ చేశారు. ఫుల్లుగా మద్యం తాగి వచ్చి ఇంట్లో పడుకున్న పళనివేలు ను దారుణంగా హత్య చేశారు.
అయితే ఈ హత్య గురించి సమాచారం అందుకున్న పోలీసులు నిందితురాలైన కవిత తో పాటు సహకరించిన ఇద్దరు కొడుకులను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.