భర్తను చంపి వాటర్ ట్యాంక్ ఎక్కిన భార్య.. ఆ తరువాత...
కాన్పూర్లో ఓ మహిళ తన భర్త హత్యకేసులో తన సోదరులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ వాటర్ ట్యాంక్ ఎక్కింది. ఆ తర్వాత ఇదే కేసులో మహిళను కూడా కాన్పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ కేసులో సదరు వ్యక్తి భార్య.. సోదరులను పోలీసులు అనుమానించారు. వారిని అరెస్ట్ చేయడానికి వచ్చారు. అయితే.. తన భర్త హత్యకు సంబంధించిన కేసులో తన సోదరులను పోలీసులు అరెస్టు చేయడంపై ఆ మహిళ తీవ్రంగా వ్యతిరేకించింది. వారు నిర్దోషులని, వారిని అరెస్ట్ చేయద్దని చెబుతూ వాటర్ ట్యాంక్ పైకి ఎక్కింది. ఇది జరిగిన ఒక రోజు తర్వాత ఈ కేసుకు సంబంధించి మహిళలను కూడా పోలీసులు అరెస్టు చేయడంతో కేసు మరో మలుపు తిరిగింది.
నిందితురాలైన మహిళ ఏప్రిల్ 30న కాన్పూర్లోని గోవింద్పూర్ పోలీస్ స్టేషన్లో తన భర్త కనిపించడం లేదంటూ మిస్సింగ్ కేసు నమోదు చేసింది. ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన గోవింద్పూర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా కాన్పూర్లోని పాండు నదిలో బాధితుడి బైక్ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సమీపంలోని ఫతేపూర్ జిల్లాలో బాధితుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
రైలులో రూ. 2 లక్షల ఫోన్ చోరీ.. నిందితుడిని పట్టించిన చెప్పులు.. ఎలాగో తెలుసా..?
దర్యాప్తులో తేలిన వివరాల ఆధారంగా, బాధితుడి బావమర్దులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో హత్యలో వారి ప్రమేయం ఉందని వెలుగులోకి వచ్చింది. అంతేకాకుండా, తన భర్త షకీల్ ను హత్య చేయాలని భార్యే మర్డర్ ప్లాన్ చేసిందని తేలింది. షకీల్ తీవ్రంగా గృహహింసకు పాల్పడేవాడని.. అది భరించలేక ఆమె అతడిని అంతం చేయాలని.. తన సోదరులతో కలిసి పథకం వేసిందని పోలీసుల విచారణలో తేలింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, విచారణలో, నిందితురాలైన మహిళ షకీల్ను తన తల్లిదండ్రుల ఇంటికి పిలిచింది. ఆ తరువాత అతనికి మద్యం తాగించి.. ఆ మత్తులో ఆమె సోదరుల సహాయంతో హత్య చేసింది.
ఆమె సోదరుల అరెస్టుకు ప్రతిస్పందనగా వాటర్ ట్యాంక్ ఎక్కి నాటకం ఆడింది. అంతేకాదు దీనివల్ల తనను తాను రక్షించుకునే ప్రయత్నం కూడా చేసింది. దీనిమీద అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ సంతోష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, "నిందితురాలు తన భర్త కోసం గోవింద్పూర్ పోలీస్ స్టేషన్లో తప్పిపోయిన నివేదికను దాఖలు చేసింది. తరువాత, షకీల్ బైక్ను పాండు నది నుండి స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత అతని మృతదేహాన్ని ఫతేపూర్ జిల్లాలో కనుగొన్నారు. దాన్ని స్వాధీనం చేసుకున్నారు" అని తెలిపారు.
"మా దర్యాప్తులో, షకీల్ ను అతని భార్య తన తల్లిదండ్రుల ఇంటికి తీసుకెళ్లిందని గుర్తించాం. అక్కడ ఆమె తన సోదరుల సహాయంతోఅతన్ని హత్య చేసింది" అని ఏసీపీ సింగ్ తెలిపారు. పోలీసుల విచారణ అనంతరం ఆ మహిళ లొంగిపోవడంతో.. అదుపులోకి తీసుకుని జైలుకు పంపారు.