సారాంశం
రైలులో దొంగిలించబడిన రూ. 2 లక్షల ఫోన్ను గుర్తించడంలో పోలీసులకు చెప్పులు సహాయపడ్డాయి. సీసీటీవీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాల పరిశీలించిన పోలీసులు.. చోరీ చేసిన వ్యక్తి చెప్పులను, నడకను నిశితంగా గమనించి.. తెలివిగా నిందితుడిని పట్టుకోగలిగారు.
ముంబై: రైలులో దొంగిలించబడిన రూ. 2 లక్షల ఫోన్ను గుర్తించడంలో పోలీసులకు చెప్పులు సహాయపడ్డాయి. సీసీటీవీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాల పరిశీలించిన పోలీసులు.. చోరీ చేసిన వ్యక్తి చెప్పులను, నడకను నిశితంగా గమనించి.. తెలివిగా అతడిని పట్టుకోగలిగారు. నిందితుడినిహేమ్రాజ్ బన్సీవాల్గా గుర్తించారు. అయితే హేమ్రాజ్ ఫోన్ అసలు విలువ తెలియక కేవలం 3500 రూపాయలకే తన స్నేహితుడు దేవిలాల్ చౌహాన్కు విక్రయించాడు. హేమరాజ్తో పాటు, దేవిలాల్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు ముంబైలో చోటుచేసుకుంది.
వివరాలు.. సెంట్రల్ రైల్వేలో ఉద్యోగం చేస్తున్న ఓ మహిళా మే 24వ తేదీన రైలులో ప్రయాణించింది. ఆమె లేడీస్ ఫస్ట్క్లాస్ కంపార్ట్మెంట్లో కూర్చుని సీటుపై తన ఫోన్ని ఉంచింది. అయితే ఆమె సీఎస్ఎంటీ స్టేషన్లో రైలు దిగుతుండగా తన మొబైల్ తన వద్ద లేదని గుర్తించింది. వెంటనే తిరిగి తన సీటు వద్దకు చేరుకుంది. అయితే తన ఫోన్ కనిపించలేదు.
ఈ విషయమై ఆమె మే 25వ తేదీన సీఎస్ఎంటీ జీఆర్పీ సిబ్బందికి ఫిర్యాదు చేసింది. దీంతో జీఆర్పీ సిబ్బంది ఫిర్యాదుపై చర్యలు చేపట్టారు. అయితే ఆమెకు మొబైల్ పోయిందా లేదా దొంగిలించబడిందా అనేది తెలియకుండా పోయింది. నిఘా ఫుటేజీని అధ్యయనం చేసిన తర్వాత.. నిందితుడు పాత నేరస్తుడిగా కనిపించడం లేదనే నిర్దారణకు వచ్చారు. అయితే అతను ఎక్కడికో ప్రయాణిస్తున్నట్లు కనిపించింది.
ఈ క్రమంలోనే పోలీసులు తెలివిగా ఆలోచించారు.. ఫిర్యాదు చేసిన మహిళా ప్రయాణించిన రైలు ఉదయం 11.35 గంటలకు సీఎస్ఎంటీకి చేరుకుందని వారి తెలుసు. దీంతో మరుసటి రోజు మేము అదే రైలు, సీఎస్ఎంటీ వద్ద ప్రయాణాన్ని ముగించిన ఇతరులపై నిఘా ఉంచాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే మే 26వ తేదీ మధ్యాహ్నం ప్లాట్ఫారమ్లపై నిఘా ఉంచినప్పుడు.. నిఘా కెమెరాలో రికార్డైన అనుమానిత వ్యక్తికి(హేమ్రాజ్) సంబంధించిన అవే పాదరక్షలు, సరిపోలే నడకతో ఒక వ్యక్తిని గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. రెండు రోజుల క్రితం రైలు నుండి ఫోన్ తీసుకున్నట్లు అంగీకరించాడు. లేడీస్ కోచ్ ద్వారా తాను సీఎస్ఎంటీలోని ఒక ప్లాట్ఫారమ్ నుంచి మరొక ప్లాట్ఫారానికి దాటుతున్న సమయంలో సీటుపై పడి ఉన్న ఫోన్ను గుర్తించి టెంప్ట్ అయ్యానని చెప్పాడు. దానిని తన స్నేహితుడు దేవిలాల్ చౌహాన్కు విక్రయించినట్టుగా అంగీకరించాడు. దీంతో పోలీసులు దేవిలాల్ నుంచి ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.