రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికలు: తేల్చని జగన్, కేసీఆర్
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికల్లో టీఆర్ఎస్, వైసీపీలు ఎన్డీఏకు మద్దతిస్తాయా, విపక్షాలకు మద్దతిస్తాయా అనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికల్లో ఎన్డీఏకు వ్యతిరేకంగా ఓటు వేయాలని టీడీపీ నిర్ణయం తీసుకొంది.
హైదరాబాద్:రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికల్లో టీఆర్ఎస్, వైసీపీలు ఎన్డీఏకు మద్దతిస్తాయా, విపక్షాలకు మద్దతిస్తాయా అనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికల్లో ఎన్డీఏకు వ్యతిరేకంగా ఓటు వేయాలని టీడీపీ నిర్ణయం తీసుకొంది.
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికలను ఈ నెల 9వ తేదీన నిర్వహించనున్నారు.ఈ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధిగా హరివంశ్ సింగ్ బరిలో ఉండనున్నారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్గా విజయం సాధించాలంటే రాజ్యసభలో 123 మంది సభ్యుల బలం అవసరం. అయితే టీఆర్ఎస్, బీజేడీ ల సహాయం అవసరం అనివార్యమైంది. అయితే ఈ రెండు పార్టీలు ఏ రకంగా వ్యవహరిస్తాయనేది ప్రస్తుతం రాజకీయ పరిశీలకులు ఆసక్తిని కనబరుస్తున్నారు.
బీహర్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్కుమార్ మంగళవారం నాడు ఉదయం తెలంగాణ సీఎం కేసీఆర్కు ఫోన్ చేశారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నిక విషయంలో తమ పార్టీ అభ్యర్ధికి మద్దతివ్వాలని ఆయన కోరారు. అయితే ఈ విషయమై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకొంటామని కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధులకే టీఆర్ఎస్ మద్దతును ప్రకటించింది.
ఇదిలా ఉంటే ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు ఏపీ విభజన హమీ చట్టం తదితర అంశాలపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ ఇప్పటికే ఎన్డీఏ నుండి టీడీపీ వైదొలిగింది. ఎన్డీఏ నుండి బయటకు వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ అవిశ్వాసాన్ని ప్రతిపాదించింది.
ప్రతి రోజూ పార్లమెంట్ ఉభయ సభల్లో బీజేపీ తీరును టీడీపీ ఎంపీలు ఎండగడుతున్నారు. ఈ తరుణంలో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు చేయాలని టీడీపీ నిర్ణయం తీసుకొంది. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికల్లో వైసీపీ ఏ రకమైన నిర్ణయం తీసుకొంటుందోననే విషయమై సర్వాత్ర ఆసక్తి నెలకొంది.
రాష్ట్రపతి ఎన్నికల సమయంలో ఎన్డీఏ కోరకున్నా ఆ పార్టీకి వైసీపీ మద్దతును ప్రకటించింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడ ఎన్డీఏకే వైసీపీ మద్దతును ప్రకటించింది.అయితే రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నిక విషయంలో ఎన్డీఏకు అనుకూలంగా వైసీపీ మద్దతిస్తోందా... లేదా యూపీఏ అభ్యర్థికి మద్దతుగా నిలుస్తోందా.. లేదా తటస్థంగా ఉంటుందా అనేది ప్రస్తుతం చర్చ సాగుతోంది.
ఎన్డీఏకు వైసీపీ సన్నిహితంగా ఉంటుందనే విషయమై కొంతకాలంగా టీడీపీ నేతలు చెబుతున్నారు. ఎన్డీఏ అభ్యర్ధికి వైసీపీ మద్దతిస్తోందా లేదా అనేది రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.