ఏం చేశాడని.. ఫడ్నవీస్ భార్య వ్యాఖ్యలపై రాజకీయ దుమారం.. మోడీ టార్గెట్ గా నితీష్ కుమార్ విమర్శలు
Patna: మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ దేశానికి ఇద్దరు జాతిపితలు ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు నాయకులు ఆమె వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేయగా, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సైతం ఆ వ్యాఖ్యలను తప్పుబడుతూ.. మోడీ ఈ దేశానికి ఏం చేశారంటూ మండిపడ్డారు.
Bihar Chief Minister Nitish Kumar: బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్ మరోసారి కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. నరేంద్ర మోడీ దేశానికి ఏం చేశారంటూ మండిపడ్డారు. అలాగే, బీజేపీ అనుబంధ సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) పై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో వీరు చేసిందేమీలేదనీ, వారిని ఈ ఉద్యమంతో సంబంధంలేదని పేర్కొంటూ ఇప్పుడు సరికొత్త వాదనలు తీసుకువస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఆరెస్సెస్ భారత స్వాతంత్య్ర పోరాటానికి సహకరించలేదని పేర్కొన్నారు.
వివరాల్లోకెళ్తే.. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ దేశానికి ఇద్దరు జాతిపితలు ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతూనే ఉన్నాయి. అమృతా ఫడ్నవీస్ డిసెంబర్ 21న ప్రధాని మోడీని 'న్యూ ఇండియా'కి 'ఫాదర్ ఆఫ్ ది నేషన్' అని పిలిచారు. అయితే, ఇప్పటికే పలువురు నాయకులు ఆమె వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేయగా, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సైతం ఆ వ్యాఖ్యలను తప్పుబడుతూ.. మోడీ ఈ దేశానికి ఏం చేశారంటూ మండిపడ్డారు. ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించే సమయంలో ఆయనను భారత జాతిపిత మహాత్మా గాంధీతో పోల్చడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
"భారత స్వాతంత్య్రం కోసం వారు ఏమి చేసారు? స్వాతంత్య్రం కోసం జరిగిన పోరాటంలో ఆర్ఎస్ఎస్ సహకారం లేదు. మా నాన్న స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. వలస పాలన ముగిసిన తర్వాత నేను జన్మించినప్పటికీ, మేము ప్రతిదీ అర్థం చేసుకున్నాము" అని నితీష్ కుమార్ అన్నారు. అలాగే, "మహాత్మా గాంధీ చేసిన సహకారాన్ని మనం మరచిపోగలమా?.." అంటూ ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకుని ప్రశ్నలు సంధించారు. "కొత్త జాతికి కొత్త జాతిపిత.. కానీ మీరు ఈ దేశం కోసం ఏమి చేసారు? ఏదైనా ముఖ్యమైనది జరిగిందా? భారతదేశం ఎలా అభివృద్ధి చెందింది? జరిగిన ఏకైక విషయం ఏమిటంటే కొత్త సాంకేతికత అభివృద్ధి చేయబడింది. అదే.. మీడియాకు ఇకపై స్వేచ్ఛ లేదు" అని ఆరోపించారు.
అరెస్సెస్ పైనా విమర్శలు గుప్పించిన నితీష్ కుమార్.. "వారికి స్వాతంత్య్ర పోరాటంతో ఎటువంటి సంబంధం లేదు..స్వాతంత్య్ర పోరాటానికి ఆరెస్సెస్ సహకరించలేదు. 'న్యూ ఫాదర్ ఆఫ్ ది నేషన్' అనే వ్యాఖ్య గురించి మనం చదివాము. .. 'న్యూ ఇండియా కు కొత్త జాతిపిత ఏం చేశారు? అని ఫైర్ అయ్యారు. కాగా, అంతకుముందు డిసెంబర్ 21న అమృత ఫడ్నవీస్ మాట్లాడుతూ, "భారతదేశంలో ఇద్దరు దేశ పితామహులు ఉన్నారు. ఒకరు పూర్వపు భారతదేశానికి చెందినవారు, మరొకరు కొత్త భారతదేశం కోసం. మహాత్మా గాంధీ భారతదేశపు 'జాతిపిత' అని నేను నమ్ముతున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నవ భారతదేశానికి జాతి పితామహుడు అంటూ వ్యాఖ్యానించారు.
అమృతా ఫడ్నవీస్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తమవుతోంది. మహాత్మాగాంధీని ఎవరితోనూ పోల్చలేమని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే అన్నారు. 'జాతిపితని ఎవరితోనూ పోల్చలేం. వారి (బీజేపీ) 'న్యూ ఇండియా' కొంతమంది స్నేహితులను ధనవంతులను చేయడం మాత్రమే, మిగిలిన జనాభా అణచబడ్డ.. ఆకలి మంటల్లో ఉంది. మనకు ఈ 'న్యూ ఇండియా' అవసరం లేదుస అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. 'కొంతమంది ధనవంతులైన వ్యాపారవేత్తల కోసం మోడీని 'న్యూ ఇండియా పితామహుడు'గా మార్చాలనుకుంటే వారిని తయారు చేయనివ్వండి. అందుకు వారిని అభినందిస్తున్నాను' అంటూ విమర్శించారు.