01:32 PM (IST) Oct 12

వైసిపి ఎమ్మెల్సీ అనంత్ బాబు నో బెయిల్... తిరస్కరించిన హైకోర్టు

తన వద్ద డ్రైవర్ గా పనిచేసిన దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్యకేసులో వైసిపి ఎమ్మెల్యే అనంత్ బాబుకు మరోసారి ఏపీ హైకోర్టు బెయిల్ ఇవ్వడానికి తిరస్కరించింది. ఇప్పటికే రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో మూడుసార్లు బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురవగా ఆయన హైకోర్టును ఆశ్రయించాడు. తాజాగా హైకోర్టు కూడా బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. 

12:58 PM (IST) Oct 12

టీఆర్ఎస్ కార్యాలయాన్ని ఖాళీ చేయించిన ఇంటి యజమాని..

అద్దె కట్టలేదని అధికార టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని భవన యజమాని ఖాళీ చేయించిన ఘటన హైదరాబాద్ బోరబండలో చోటుచేసుకుంది. మాజీ డిప్యూటీ మేయర్, టీఆర్ఎస్ కార్పోరేటర్ బాబా ఫసియుద్దిన్ ఈ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నాడు. అయితే అద్దె కట్టడంలేదంటూ కోర్టును ఆశ్రయించి అనుమతి పొందిన ఇంటి యజమాని పోలీసుల సాయంతో ఖాళీ చేయించాడు. ఈ సమయంలో కొంత ఉద్రిక్తత చోటుచేసుకున్నా పోలీసులు అదుపుచేసారు. 

12:18 PM (IST) Oct 12

ఈ నెల 25న తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత...

ఈ నెల 25న సూర్యగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు టిటిడి ప్రకటించింది. ఈ రోజు సాయంత్రం సూర్యగ్రహణం వున్నా ఉదయం 8.11 గంటల నుండి రాత్రి 7.30 గంటల వరకు ఆలయ తలుపులు మూసివేస్తామని తెలిపారు. ఈ విషయాన్ని భక్తులు గుర్తించి టిటిడికి సహకరించాలని అధికారులు కోరుతున్నారు. 


11:35 AM (IST) Oct 12

హైదరాబాద్ లో కోట్లలో హవాలా డబ్బు పట్టివేత..

హైదరాబాద్ : బంజారాహిల్స్ లో రోడ్ నెంబర్ 12 లో భారీగా హవాలా నగదు పట్టుబడింది. దాదాపు 2కోట్ల హవాలా నగదును కారులో తరలిస్తుండగా పక్కా సమాచారంతో వెస్ట్ జోన్ టాస్క్‌ ఫోర్స్‌, బంజారాహిల్స్ పోలీసులు పట్టుకున్నారు. నగదుతో పాటు కారును బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

Read more హైద్రాబాద్ లో హవాలా కలకలం: హైద్రాబాద్ బంజారాహిల్స్ లో రూ. 2 కోట్ల విలువైన నగదు సీజ్


10:18 AM (IST) Oct 12

దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు... 26వేలకు చేరిన యాక్టివ్ కేసులు

ఇండియాలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గత 24 గంటల్లో 27,374 నుండి 26,292కి యాక్టివ్ కేసులు తగ్గాయి. ఇదే సమయంలో కొత్తగా 2,139 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదయిన మొత్తం కేసులు 4,46,18,533 కు చేరితే మరణాల సంఖ్య 5,28,835 కు చేరింది. 

09:38 AM (IST) Oct 12

విజయవాడలో భారీ వర్షాలు... ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు మూసివేత

విజయవాడలో భారీ వర్షాల నేపథ్యంలో ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డును తాత్కాలికంగా మూసివేసారు అధికారులు. కొండచరియలు విరిగిపడే అవకాశం వుండటంతో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగానే ఘాట్ రోడ్డును మూసేసినట్లు వెల్లడించారు. దుర్గమ్మ దర్శనానికి వచ్చేవారిని కనకదుర్గ నగర్, లిప్గ్ మార్గంలో అనుమతి ఇస్తున్నారు. 

09:27 AM (IST) Oct 12

రానున్న 24గంటల్లో ఏపీలో భారీ వర్షాలు... వాతావరణ శాఖ హెచ్చరిక

ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ ను అతలాకుతలం చేస్తున్న వర్షాలు మరో 24 గంటలు కొనసాగనున్నాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. చాలాచోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రకటించారు. కాబట్టి ప్రజలు, అధికారులు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు.